దండేపల్లి: మండల కేంద్రంలో మంగళవారం ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో ఇసీ్త్ర దుకాణం, చికెన్ సెంటర్, హోటల్ కాలిపోయాయి. స్థానిక అంగడిబజారు సమీపంలో గల గుడికందుల సత్తయ్యకు చెందిన ఇసీ్త్ర దుకాణం, దాని పక్కనే గల ఖాజామియాకు గల చికెన్ సెంటర్, దానిని ఆనుకుని ఉన్న రెడ్డవేని లచ్చనకు చెందిన హోటల్ అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. సుమారు రూ.30వేలకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
చేపల వేట నిషేధం
పాతమంచిర్యాల: జిల్లాలోని గోదావరి నది, అన్నారం, సుందిళ్ల బ్యారేజీతోపాటు మైనర్ ఇరిగేషన్, ప్రాజెక్టులు, రాళ్లవాగు, గొళ్లవాగు, ముల్కల్ల వాగు ప్రాజెక్టు, పోతనపల్లి, నీల్వాయి ప్రాజెక్టుల్లో చేపల వేట నిషేధించినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 1 నుంచి ఆగస్టు 31వరకు జలాశయాలు, చెరువుల్లో చేపల వేట నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఉత్తర్వులను ధిక్కరించి చేపల వేట సాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హనుమాన్ ఆలయంలో చోరీ
తలమడుగు: మండలంలోని కొత్తూర్ గ్రామంలో గల హనుమాన్ ఆలయంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రెండు వెండి కిరీటాలు దొంగిలించినట్లు ఎస్సై రాధిక తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని హనుమాన్ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి హనుమాన్ విగ్రహానికి ఉన్న వెండి ఆభరణాలు దొంగిలించినట్లు గ్రామస్తులు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి జాగిలాలతో వచ్చిన పోలీసులు ఆలయాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆలయంలో చోరీకి గురైన ఆభరణాల విలువ దాదాపు రూ.60 వేల వరకు ఉంటుందన్నారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.


