నిర్మల్చైన్గేట్: భారీ వర్షాలు, వరదలు సంభవించినపుడు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సోమవారం సమావేశం నిర్వహించారు. వర్షాకాలం ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, వైద్యారోగ్య, ఆర్అండ్బీ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండడం ద్వారా ప్రజలకు రక్షణ కలుగుతుందన్నారు. వర్షాల సమయంలో సమాచార మార్పిడి అత్యంత కీలకమన్నారు. ప్రాజెక్టుల పరీవాహక ప్రాంతాలు, చెరువుల కింద ఉన్న ప్రజ లకు, లోతట్టు ప్రాంతాల ప్రజలందరికీ వాతావరణ వివరాలు, నీటి మట్టపు వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. కుంగిన రోడ్లు, గుంతలు, ప్రమాదకర ప్రవాహాలు ఉండే ప్రాంతాల్లో హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసి, ప్రజలెవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టు వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రాజెక్టుల గేట్లు ఎత్తేముందు పరిసర ప్రాంతాల ప్రజలకు ముందుగా సమాచారం ఇవ్వాలని తెలిపారు. గర్భిణులు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారిని చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించాలని సూచించారు. కోతకు గురైన రోడుల, విద్యుత్ అంతరాయం కలిగితే యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు.
పటిష్ట బందోబస్తుతో రక్షణ..
ఎస్పీ జానకీషర్మిల మాట్లాడుతూ, భారీ వర్షాలు, వరద సమయంలో ప్రాజెక్టులు, ప్రమాదకర చెరువుల ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి, పోలీసు సిబ్బంది బందోబస్తు ద్వారా రక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. లోతట్టు ప్రాంతాలకు ప్రజలెవరూ వెళ్లకుండా పోలీసు శాఖ తరఫున కృషి చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, భైంసా సబ్కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, ఆర్డీవో దేవీదాస్, డీఎస్పీ శ్రీనివాస్, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు పాల్గొన్నారు.


