తానూరు: మండలంలోని హిప్నెల్లి చెరువు మరమ్మతు పనుల్లో నాణ్యత లోపించింది. 2003లో వచ్చిన భారీ వర్షాలకు చెరువు కట్ట తెగిపోయింది. మూడేళ్లుగా ఆయకట్టు రైతులు సాగు నీటి సమస్యతో తీవ్రంగా నష్టపోయారు. గతేడాది ప్రభుత్వం రూ.60.30 లక్షలు చెరువు మరమ్మతుకు మంజూరు చేసింది. మూడు నెలల క్రితం పనులు ప్రారంభించారు. ఇటీవలే పనులు పూర్తయ్యాయి. దీంతో రైతులు ఈసారి ఆయకట్టుకు సాగునీరు అందుతుందని రైతులు సంతోషపడ్డారు అయితే మొదటి వర్షాలకే నాణ్యత తేలిపోయింది. మొరం పోసిన కట్ట బీటలువారింది. మరమ్మతు చేసిన కాలువ ద్వారా నీరు వృథాగా పోతోంది. కాంట్రాక్టర్ ఇసుక స్థానంలో క్రషర్ డస్ట్ వాడినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. సరిగా క్యూరింగ్ చేయకుండా, రోలర్తో సరిగ్గా కుదించకుండా పనులు పూర్తి చేసినట్లు పేర్కొంటున్నారు. ఈమేరకు సోమవారం చెరువు కట్టను పరిశీలించారు. అనంతరం కాంట్రాక్టర్పై చర్య తీసుకోవాలని ఏఈ అదిత్యకు ఫిర్యాదు చేశారు. కట్ట వెడల్పు నాలుగున్నర మీటర్లు ఉండాలని, అంచు జారుడు కారణంగా కొంత మట్టి కొట్టుకుపోయిందని తెలిపారు. రైతులు ఈ సమాధానంపై సంతృప్తి చెందలేదు. రైతులు పనుల నాణ్యతను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.


