నన్నే ముట్టుకుంటావా.. నీకెంత ధైర్యం అంటూ | Woman Slaps Mumbai Civic Worker After Stopped Not Wearing Mask | Sakshi
Sakshi News home page

బీఎంసీ కార్మికురాలిపై మహిళ దాడి

Mar 19 2021 9:53 PM | Updated on Mar 19 2021 9:53 PM

Woman Slaps Mumbai Civic Worker After Stopped Not Wearing Mask - Sakshi

బీఎంసీ కార్మికురాలి కాలర్‌ పట్టుకుని లాగుతున్న మహిళ(ఫొటో కర్టెసీ: ఎన్డీటీవీ)

ముంబై: మహమ్మారి కరోనా విజృంభణ నేపథ్యంలో మాస్కు పెట్టుకొమ్మని సూచించిన పారిశుధ్య కార్మికురాలిపై ఓ మహిళ అనుచితంగా ప్రవర్తించింది. ‘‘నన్నే ఆపుతావా? నీకెంత ధైర్యం ఉంటే నన్ము ముట్టుకుంటావు’’అంటూ విచక్షణా రహితంగా ఆమెను కొట్టింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాలు... ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ మాస్కు ధరించలేదు. ఈ విషయాన్ని గమనించిన బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) కార్మికురాలు ఆటోను ఆపింది. మాస్కు ధరించాల్సిందిగా ఆమెకు చెప్పింది. దీంతో కోపోద్రిక్తురాలైన సదరు మహిళ, కార్మికురాలిపై చేయిచేసుకోగా ఆమె ప్రతిఘటించింది. అంతేగాక ఆమెను వెళ్లకుండా అడ్డుకుంది.

దీంతో మరింతగా రెచ్చిపోయిన సదరు మహిళ.. ఆటో దిగి వచ్చి ఇష్టం వచ్చినట్లు ఆమెను కొట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు.. ‘‘ఎందుకంత కోపం. మంచి చెబితే కూడా ఇలా ఎవరైనా కొడతారా’’ అంటూ సదరు మహిళను విమర్శిస్తున్నారు. కాగా రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. గురువారం నాటికి అక్కడ కొత్తగా 25,833 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టింది. లాక్‌డౌన్‌ విధించే యోచనలో ఉంది. ఇక ముంబైలో మాస్కు ధరించకుండా బయటకు వస్తే రూ. 200 జరిమానా విధిస్తున్నారు.
చదవండి: కొవిడ్‌ నివారణకు లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గం: ఉద్దవ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement