నేను పులి: ‘నందిగ్రామ్‌’లో మమతా బెనర్జీ గర్జన

West Bengal Assembly Elections: I Am Royal Bengal Says Mamata Banerjee - Sakshi

కోల్‌కత్తా: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 1వ తేదీన జరగనుంది. పశ్చిమ బెంగాల్‌లో ఈ రెండో దశ పోలింగ్‌లో ప్రముఖులు పోటీ చేస్తున్న స్థానాలు ఉన్నాయి. దీంతో ప్రచారంలో ఆఖరి రోజు సోమవారం హోరాహోరీగా ప్రచారం సాగింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో చక్రాల కుర్చీపైనే కూర్చుని భారీ బహిరంగ సభ నిర్వహించారు. చక్రాల కుర్చీలో కూర్చునే 8 కిలోమీటర్ల భారీ ర్యాలీలో మమత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై గర్జించారు. బీజేపీని టార్గెట్‌గా చేసుకుని మాట్లాడిన మమత అనంతరం తన పదేళ్ల పాలనను వివరించారు. 

‘నేను బెంగాల్‌ టైగర్‌’ను అంటూ మమతా బెనర్జీ ప్రకటించారు. తన ముందు ప్రత్యర్థులు పనికి రారు అని పేర్కొన్నారు. నాపై దాడి చేయడానికి ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ నుంచి గూండాలను రప్పిస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు. ప్రేమించే సంస్కృతి లేనివారు రాజకీయాలకు పనికి రారు అని హితవు పలికారు. వారి దాడులను తాను సింహంలాగా స్పందిస్తానని మమతా చెప్పారు. ఈ సందర్భంగా తనను తాను ‘రాయల్‌ బెంగాల్‌ టైగర్‌’గా మమతా అభివర్ణించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ గూండాలు వస్తే గిన్నెలు, పాత్రలతో దాడి చేయండి అని మమతా మహిళలకు పిలుపునిచ్చారు. మమతాకు పోటీగా ఆమె మాజీ అనుచరుడు సువేందు అధికారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే నందిగ్రామ్‌ నియోజకవర్గం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ స్థానానికి రెండో దశలో భాగంగా ఏప్రిల్‌ 1వ తేదీన పోలింగ్‌ జరగనుంది. దీంతో రెండు రోజుల ముందట ప్రచారం ముగిసింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top