కంగనపై విచారణ జరుపుతాం!  | We Will Investigate On Kangana Ranaut Says Punjab Home Minister Anil Deshmukh | Sakshi
Sakshi News home page

కంగనపై విచారణ జరుపుతాం! 

Sep 9 2020 4:10 AM | Updated on Sep 9 2020 7:43 AM

We Will Investigate On Kangana Ranaut Says Punjab Home Minister Anil Deshmukh - Sakshi

ముంబై: ప్రముఖ నటి కంగన రనౌత్‌ డ్రగ్స్‌ వాడతారంటూ అధ్యయన్‌ సుమన్‌ చేసిన ఆరోపణలపై ముంబై పోలీసులు విచారణ జరుపుతారని మహారాష్ట్ర హోం మంత్రి అనీల్‌ దేశ్‌ముఖ్‌ చెప్పారు. నటుడు శేఖర్‌ సుమన్‌ కొడుకు అధ్యయన్‌ గతంలో కంగనతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఒక ఇంటర్వూ్యలో చెప్పారు. ఆ సమయంలో ఆమె డ్రగ్స్‌ వాడేవారన్నారు. తాజాగా ముంబై ప్రభుత్వానికి కంగనకు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న తరుణంలో ఈ ఆరోపణలపై విచారణ ఆరంభించడం గమనార్హం.  మంగళవారం అసెంబ్లీలో శివసేన ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని లేవనెత్తారని, దీనిపై  విచారణ జరుపుతామని అనీల్‌ అన్నారు.  

నటి బంగ్లాకు నోటీసులు 
బాంద్రాలోని కంగన రనౌత్‌కు చెందిన బంగ్లాకు బృహత్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు నోటీసులు అంటించారు. తమ అనుమతుల్లేకుండా బిల్డింగ్‌లో అనేక మార్పులు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. దాదాపు డజనుకుపైగా ఇలాంటి అక్రమ మార్పులు జరిగాయని, ఉదాహరణకు టాయిలెట్‌కు చెందిన స్థలంలో ఆఫీసు కేబిన్‌ కట్టారని, మెట్ల వద్ద కొత్త టాయిలెట్లను నిర్మించారని బీఎంసీ అధికారులు తెలిపారు. నోటీసులు అందుకునేందుకు ఇంట్లో ఎవరూ లేనందున బిల్డింగ్‌కు అతికించినట్లు చెప్పారు. 24 గంటల్లో వీటికి కంగన స్పందించాలన్నారు.

పూర్తిగా సహకరిస్తా! 
డ్రగ్స్‌ వాడకంపై జరిపే విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని కంగన చెప్పారు. విచారణ కోసం తన రక్త నమూనాలను తీసుకోవచ్చన్నారు. మాదకద్రవ్యాల సరఫరాదారులతో తనకు సంబంధాలున్నట్లు భావిస్తే తన కాల్‌ రికార్డులను విచారించవచ్చని చెప్పారు. వేటిలోనైనా తన తప్పుందని తేలితే ముంబైని శాశ్వతంగా వీడిపోతానన్నారు. తన బంగ్లాలో అక్రమ నిర్మాణాలపై ఇచ్చిన నోటీసుకు ఆమె తన లాయర్‌ ద్వారా సమాధానం తెలిపారు. బీఎంసీ అధికారులు అక్రమంగా భవనంలోకి చొరబడ్డారని, వారివన్నీ నిరాధార ఆరోపణలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement