ప‌దేళ్ల‌ క్రితం స‌రిగ్గా ఇలాంటి ప్ర‌మాద‌మే!

Wait For The Outcome Of Probe Into Kerala Plane Crash Says Minister - Sakshi

తిరువనంతపురం :  దుబాయ్ నుంచి కేరళలోని కోళీకోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం క్యారిపూర్ ఎయిర్ పోర్టు రన్‌వేపై ప్రమాదానికు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్ర‌మాదాన్ని మంగ‌ళూరు ప్ర‌మాదంతో పోల్చి చూడ‌టం స‌రికాద‌ని కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరి అన్నారు. కోళీకోడ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయ‌న్నారు.  (‘ఈ ప్రమాదం గురించి 9 ఏళ్ల క్రితమే హెచ్చరించా’)

మంగ‌ళూరు ప్ర‌మాదం నుంచి పాఠం నేర్చుకున్నామ‌ని తాజా సంఘ‌ట‌న‌ను పదేళ్ల క్రితం జ‌రిగిన ప్రమాదంతో పోల్చ‌డం చాలా తొంద‌ర‌పాటు చ‌ర్య అవుతుంద‌న్నారు. పైల‌ట్ కెప్టెన్ దీప‌క్ సాతే, కో-పైల‌ట్ అఖిలేష్ కుమార్‌ల‌కు అత్యంత అనుభవజ్ఞుల‌ని మంత్రి తెలిపారు. అయితే శుక్ర‌వారం జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌కు, మంగ‌ళూరులో జ‌రిగిన ప్ర‌మాదానికి పోలీక‌లు ఉన్న‌ట్లు ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆ విమానం కూడా టేబుల్‌టాప్ ర‌న్‌వేనే. బోయింగ్ 737 ర‌కానికి చెందిన విమాన‌మే. 2010 మే 22న దుబాయ్ నుంచి మంగ‌ళూరుకు పయ‌న‌మైన విమానం కూడా ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అయ్యే స‌మ‌యంలోనే ప్ర‌మాదానికి గురైంది. అప్ప‌టి విమానం కూడా ఎయిర్ ఇండియాకు చెందిన‌దే . మంగ‌ళూరు ఘ‌ట‌న‌లో మొత్తం 158 మంది ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. ఎయిర్ ఇండియా చ‌రిత్ర‌లోనే అతిపెద్ద ప్ర‌మాదం అది.

క‌రోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్నవారిని వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశానికి చేరవేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే  దుబాయ్ నుంచి కేరళలోని కోళీకోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం క్యారిపూర్ విమనాశ్రయంలో విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో రన్‌వేపై నుంచి పక్కకు జారి లోయలో పడి ప్రమాదానికి గురి అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌న‌లో మృతిచెందిన వారి సంఖ్య 20కు చేరుకుంది. ల్యాండింగ్‌ సమయంలో దుబాయ్-కోళీకోడ్ విమానం పూర్తి వేగంతో ఉందని, రన్‌వేను ఓవర్‌షాట్ చేసిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. ల్యాండింగ్‌కు రెండు సార్లు ప్రయత్నించడం, కాస్త ఎక్కువ వేగంతో ల్యాండ్‌ అవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. (కేరళ విమాన ప్రమాదానికి కారణం ఇదేనా!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top