‘ఎన్సీపీ’ గుర్తు వివాదం..సుప్రీంకోర్టులో ‘ట్రంప్‌’ ప్రస్తావన | Trump Gets A Mention In Supreme Court During NCP Symbol Case | Sakshi
Sakshi News home page

‘ఎన్సీపీ’ గుర్తు వివాదం..సుప్రీంకోర్టులో ‘ట్రంప్‌’ ప్రస్తావన

Nov 13 2024 7:58 PM | Updated on Nov 13 2024 8:30 PM

Trump Gets A Mention In Supreme Court During NCP Symbol Case

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల వేళ నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) చీలిక వివాదంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్సీపీ అసలు గుర్తు గడియారంతో అజిత్‌పవార్‌ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ గుర్తుపై కోర్టులో వివాదం నడుస్తోందని ప్రచారంలో స్పష్టంగా పేర్కొన్నాలని ఎన్నికల ప్రచారంలో సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది. 

అయితే పార్టీ ప్రచార ప్రకటనల్లో అజిత్‌పవార్‌ ఈ నిబంధనను సరిగా పాటించడం లేదని శరద్‌పవార్‌వర్గం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై బుధవారం(నవంబర్‌ 13)సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో  ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటుచేసుకుంది.

ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రస్తావన సుప్రీం కోర్టులో వచ్చింది. అజిత్‌ పవార్‌ ఎన్సీపీ పార్టీ పత్రికల్లో ఇచ్చిన ప్రచార ప్రకటనలు చూపిస్తూ శరద్‌పవార్‌ వర్గం న్యాయవాది అభిషేక్‌మను సింఘ్వి వాదిస్తున్నారు. అయితే ఆ పేపర్లలో అజిత్‌ పవార్‌ పార్టీ ప్రకటనలకు కాస్త పైనే ట్రంప్‌ ఫొటో ఉంది. 

దీనిని గమనించిన జడ్జి జస్టిస్‌ సూర్యకాంత్‌ న్యాయవాది సింఘ్వీకి సరదాగా ఈ విషయం చెప్పారు. ట్రంప్‌ ఫొట కూడా ప్రకటనలకు దగ్గరగా ఉందన్నారు. దీనికి స్పందించిన సింఘ్వీ ట్రంప్‌ ఎలాంటి పిటిషన్‌ వేయలేదని నవ్వుతూ సమాధానమిచ్చారు. ఈ పరిణామంతో సుప్రీంకోర్టులో సరదా వాతావరణం నెలకొంది. తర్వాత కేసులో వాదనలు కొనసాగాయి. 

ఇదీ చదవండి: అజిత్‌ ఎన్సీపీకి సుప్రీంకోర్టు చివాట్లు 

Advertisement
 
Advertisement
Advertisement