ఎమర్జెన్సీ యోధులు చిరస్మరణీయులు | Those Who Fought Emergency Should Always Be Remembered: PM Modi On Mann Ki Baat | Sakshi
Sakshi News home page

ఎమర్జెన్సీ యోధులు చిరస్మరణీయులు

Jun 30 2025 3:52 AM | Updated on Jun 30 2025 3:52 AM

Those Who Fought Emergency Should Always Be Remembered: PM Modi On Mann Ki Baat

రాజ్యాంగ పరిరక్షణలో వారి పోరాటమే స్ఫూర్తి 

మన్‌కీ బాత్‌లో మోదీ

న్యూఢిల్లీ: దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన వ్యక్తులు రాజ్యాంగాన్ని హత్య చేయడంతోపాటు న్యాయ వ్యవస్థను చెరబట్టారని, కీలుబొమ్మను చేసి ఆడించారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఎమర్జెన్సీ పేరిట అప్పటి ప్రభుత్వం ప్రజలను వేధింపులకు గురి చేసిందని, లెక్కలేనన్ని అఘాయిత్యాలు జరిగాయని ఆరోపించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం సాగించిన నాయకులు చిరస్మరణీయులని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ విషయంలో వారి పోరాటమే మనకు స్ఫూర్తి అని ఉద్ఘాటించారు. ఆదివారం 123వ ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ప్రజల భాగస్వామ్యం, వారి సమ్మిళిత శక్తితో ఎలాంటి సంక్షోభాలనైనా ఎదుర్కోవచ్చని అన్నారు. కొన్ని ఆడియో రికార్డులను ప్రధానమంత్రి వినిపించారు. సంక్షోభం అంటే ఎంత భయకరంగా ఉంటుందో వీటిద్వారా తెలుస్తుందని అన్నారు. ఎమర్జెన్సీ తర్వాత ప్రధానమంత్రిగా పనిచేసిన మొరార్జీ దేశాయ్‌ మాట్లాడిన ఆడియో, ఎమర్జెన్సీ దారుణాల గురించి మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయ్, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్‌ మాట్లాడిన ఆడియోలు ఇందులో ఉన్నాయి.  

నాటి దారుణాలు మరవలేం 
‘‘ఇందిర హయాంలో ప్రజలపై దమనకాండ కొన్ని సంవత్సరాలపాటు నిరంతరాయంగా కొనసాగింది. ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత రెండేళ్లపాటు మరింత తీవ్రంగా మారింది. ప్రజల హక్కులను హరించారు. స్వాతంత్య్రపు హక్కును అణచివేశారు. వార్తాపత్రికలపై కఠిన ఆంక్షలు విధించారు. కోర్టులను సైతం వదల్లేదు. వాటికి అధికారాలు లేకుండా చేశారు. లక్ష మందికిపైగా జనాన్ని జైళ్లలో పెట్టారు. అక్షరాలా రాక్షస పాలన సాగించారు’’ అని మొరార్జీ దేశాయ్‌ మాట్లాడిన ఆడియోలో వినిపించింది. 1975 నుంచి 1977 దాకా 21 నెలలపాటు ప్రజలను చిత్రహింసలకు గురి చేశారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. అప్పటి దారుణాలను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు.

జార్జి ఫెర్నాండెజ్‌ చేతులకు సంకెళ్లు వేశారని, మీసా చట్టం కింద వేలాది మందిని నిర్బంధించి, వారిపట్ల అమానవీయంగా ప్రవర్తించారని గుర్తుచేశారు. కానీ, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేశారని, చివరకు విజయం సాధించారని చెప్పారు. ఎమర్జెన్సీ విధించినవారికి గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లయిన సందర్భంగా ఇటీవల ‘సంవిధాన్‌ హత్య దివస్‌’ జరుపుకున్నామని మోదీ తెలిపారు. 1977 ఎన్నికల్లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత వాజ్‌పేయ్‌ ఏం మాట్లాడారంటే.. ‘‘దేశంలో ఇప్పుడు జరిగిన దాన్ని కేవలం ఎన్నికలు అనలేం. ఇదొక శాంతియుత విప్లవం. ప్రజా వెల్లువ ప్రజాస్వామ్య హంతకులను కుర్చీ నుంచి కూలదోసింది. వారిని చెత్తబుట్టలోకి విసిరేసింది’’ దీనిపై మోదీ స్పందిస్తూ.. అత్యవసర పరిస్థితిని ఎదిరించి పోరాడిన వారిని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలని చెప్పారు.

ట్రకోమా రహిత దేశంగా భారత్‌  
బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌ ‘ట్రకోమా’ రహిత దేశంగా భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని ప్రధాన మోదీ అన్నారు. ఇందుకోసం కృషి చేసినవారికి అభినందనలు తెలియజేశారు. అస్సాంలోని బోడోలాండ్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారులుకు కేంద్రంగా మారిందని హర్షం వ్యక్తంచేశారు. మేఘాలయాలో ఎరీ సిల్క్‌కు భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్‌ లభించిందని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పట్టు పరుగులను చంపకుండా అక్కడ వ్రస్తాలు తయారు చేస్తున్నారని ప్రధాని వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement