టీబీ నుంచి డెంగ్యూ వరకూ.. 8 టీకాల పరీక్షకు అనుమతి | Testing of Eight Vaccines Approved this Year | Sakshi
Sakshi News home page

టీబీ నుంచి డెంగ్యూ వరకూ.. 8 టీకాల పరీక్షకు అనుమతి

Sep 5 2024 8:28 AM | Updated on Sep 5 2024 10:11 AM

Testing of Eight Vaccines Approved this Year

న్యూఢిల్లీ: టీకాలతో కరోనాకు అడ్డుకట్టవేడంలో విజయం సాధించిన అనంతరం ఇతర అంటు వ్యాధులను కూడా టీకాలతో అరికట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం చేపట్టిన ఈ టీకా విధానంలో ఈ సంవత్సరం ఎనిమిది కొత్త వ్యాక్సిన్‌లను పరీక్షించడానికి ఆమోదించింది.

ఇందులో టీబీ నుండి డెంగ్యూ ఇన్‌ఫెక్షన్ వరకూ టీకాలు ఉన్నాయి. ఈ ఎనిమిదింటిలో నాలుగు వ్యాక్సిన్‌లు తుది దశలో ఉన్నాయి. ఈ టీకాల సాయంతో దేశంలోని కోట్లాది మంది ప్రజలు ప్రయోజనాలను పొందవచ్చు. వచ్చేరెండేళ్లలో ఈ టీకాల పరీక్షలన్నీ పూర్తవుతాయని అంచనా. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) నుంచి ఈ ఏడాది జనవరి, ఆగస్టు మధ్య మొత్తం ఆరు ఫార్మా కంపెనీలకు ఎనిమిది వేర్వేరు వ్యాక్సిన్‌లపై ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి లభించింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన నిపుణుల ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఎస్‌ఈసీ) సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్- ఈ కంపెనీకి డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్, హెపటైటిస్ బీ (ఆర్‌డిఎన్‌ఎ), ఇన్‌యాక్టివేటెడ్ పోలియోమైలిటిస్, హేమోఫిలస్ ఇన్‌ఫ్లుఎంజా టైప్ బి వ్యాక్సిన్‌లపై ఫేజ్- II ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి లభించింది. న్యూమోకాకల్ పాలీశాకరైడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు కూడా ఈ కంపెనీ అనుమతి పొందింది. ఈ వ్యాధి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ న్యుమోకాకల్ బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. అదేవిధంగా డెంగ్యూ వ్యాక్సిన్‌పై మూడవ దశ ట్రయల్‌ నిర్వహించేందుకు పనేసియా బయోటెక్ కంపెనీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

టీబీ ఇన్‌ఫెక్షన్ నుంచి బయటపడేందుకు ప్రభుత్వం చాలా కాలంగా బీసీజీ వ్యాక్సిన్‌పై కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగా టీబీ వ్యాధి నివారణకు బీసీజీ వ్యాక్సిన్‌ను పరీక్షించేందుకు హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ కంపెనీకి అనుమతి లభించింది. ట్రయల్‌లోని ప్రాథమిక ఫలితాల ఆధారంగా సీడీఎస్‌సీఓ దశ- III ట్రయల్‌ను ప్రారంభించడానికి కూడా అనుమతిని ఇచ్చింది. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (ఆర్‌ఎస్‌వీ)తో బాధపడుతున్న రోగుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోందని సీడీఎస్‌సీఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇది ఊపిరితిత్తులు,శ్వాసకోశంలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. దీనికి కూడా ప్రభుత్వ వ్యాక్సిన్ పాలసీ జాబితాలో స్థానం దక్కింది. దీని కోసం మూడవ దశ ట్రయల్‌కు జీఎస్‌కే కంపెనీకి అనుమతి లభించింది.

Advertisement
 
Advertisement
Advertisement