బెంగళూరు: ఆపిల్ ప్రధాన ఐఫోన్ ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో దారుణం జరిగింది. టాయిలెట్లో బిడ్డకు 19 ఏళ్ల యువతి జన్మనిచ్చింది. ఆపై పసికందు గొంతుకోసి హత్యకు పాల్పడింది. దేవనహళ్లిలోని ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో ఉద్యోగినిగా పనిచేస్తున్న నిందితురాలు.. బుధవారం టాయిలెట్లోకి వెళ్లిన సమయంలో ప్రసవించింది. అనంతరం శిశువు గొంతు కోసి.. మృతదేహాన్ని ఒక బ్యాగులో పడేసింది. ఆమె టాయిలెట్కు వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా ప్రసవం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.
అవివాహిత అయిన ఆ యువతి.. సమాజంలో ఎదురయ్యే అవమానాలకు భయపడి శిశువును చంపినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. సహా ఉద్యోగి టాయిలెట్లోకి వెళ్లినప్పుడు అక్కడ శిశువు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు.. శిశువు పుట్టిన తర్వాతే హత్యకు గురైనట్లు నిర్ధారించారు. నిందితురాలను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


