చెన్నై: వల్లియూర్లో ఎన్నికల శిక్షణకు వెళ్లిన ఒక ఉపాధ్యాయురాలి ఇంట దొంగలు పడ్డారు. 21 సవర్ల విలువైన నగలు చోరీ చేశారు. వివరాలు.. నెల్లై జిల్లా, వల్లియూర్, రామలక్ష్మి నగర్కు చెందిన రోసారియో భార్య సహాయుజిన్ శాంతి (58) ఏర్వాడి ప్రభుత్వ బాలికల పాఠశాలలో టీచర్గా పని చేస్తున్నారు.
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, పోలింగ్ కేంద్రాల అధికారులుగా పనిచేసే ఉపాధ్యాయులకు గురువారం వల్లియూర్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి సహాయుజిన్ శాంతి వెళ్లారు. అలాగే తన పోస్టల్ బ్యాలెట్కు కూడా అక్కడ నమోదు చేసుకున్నారు. తిరిగి సాయంత్రం ఇంటికి ఆమె వచ్చా రు. ఇంట్లోని బెడ్రూమ్లో బీరువా తెరచి ఉండటం, అందులో ఉన్న వాటిని చెల్లాచెదురుగా చేసి పడేసి ఉండటంతో ఆందోళన చెందారు. బీరువాను పరిశీలించి చూడగా అందులో ఉన్న 50 సవర్ల నగల్లో దాదాపు 21 సవర్ల బంగారు నగలు చోరీ చేసినట్లు గుర్తించారు.
వీటి విలువ సుమారు రూ. 21 లక్షలు. దీనిపై తన భర్తకు ఆమె సమాచారం ఇవ్వడంతో అతను ఇంట్లో పనిచేస్తున్న వారిని ప్రశ్నించాడు. తామేమీ చోరీ చేయలేదని వారు పేర్కొనడంతో చివరకు వల్లియూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ ఇంటిలోని నిఘా కెమెరా ఫుటేజీని పరిశీలించారు.ఆ ఇంట్లో పనిచేస్తున్న కొంతమంది మహిళల బంధువులు ఇద్దరు వచ్చి వెళ్లినట్లు తేలింది. దీని ఆధారంగా పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసు కుని విచారణ చేస్తున్నారు.


