తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు | Supreme Court Issues Notice to Telangana Assembly Speaker Gaddam Prasad | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

Jan 19 2026 1:02 PM | Updated on Jan 19 2026 1:31 PM

Supreme Court Issues Notice to Telangana Assembly Speaker Gaddam Prasad

సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. అదే కేసులో కేటీఆర్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌తో మహేశ్వర్ రెడ్డి పిటిషన్‌ను జత చేయాలని సూచించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. 

గత వారం ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్‌ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో చివరి ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ల విచారణను అసెంబ్లీ స్పీకర్‌ ఇంకా ముగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశమని.. మిగిలిన అనర్హత పిటిషన్లపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ అల్టి మేటం జారీ చేసింది.

ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి 8 వారాల గడువు ఇవ్వాలంటూ స్పీకర్‌ కార్యాలయం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. స్పీకర్‌ తీసుకోబోయే నిర్ణయాలతోపాటు ఇప్పటివరకు జరిగిన పురోగతిపై తదుపరి విచారణ నాటికి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేటీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్‌ సంజయ్‌ కరోల్, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మసీతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఇరుపక్షాలు వాడీవేడిగా మిగతా వాదనలు వినిపించాయి.

గడువు కోరిన ప్రభుత్వ న్యాయవాదులు 
బీఆర్‌ఎస్‌ నేతలు తమ పిటిషన్లలో ప్రతివాదులుగా పేర్కొన్న తెలంగాణ ప్రభుత్వం, స్పీకర్‌ కార్యాలయం తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, అభిషేక్‌ మను సింఘ్వీ, నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘స్పీకర్‌ కంటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. రెండు రోజులపాటు ఆస్పత్రిలో ఉన్నారు. అలాగే అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ కూడా మారారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అందువల్ల పిటిషన్ల విచారణలో జాప్యం జరిగింది. ఇప్పటికే కొన్ని అంశాలను పరిష్కరించాం. మరికొన్నింటిపై తీర్పును రిజర్వ్‌ చేశాం. మిగిలిన వాటిని పూర్తి చేయడానికి మరో 8 వారాల సమయం ఇవ్వండి’అని ముకుల్‌ రోహత్గీ ధర్మాసనాన్ని కోరారు. రెండు వారాల్లో పురోగతి చూపిస్తే నాలుగు వారాల సమయం ఇస్తామని చెబుతూ విచారణను వాయిదా వేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement