వీధికుక్కల తరలింపు తీర్పుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ | Supreme Court Bench To Hear Stray Dog Case Tomorrow | Sakshi
Sakshi News home page

వీధికుక్కల తరలింపు తీర్పుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ

Aug 13 2025 8:30 PM | Updated on Aug 13 2025 9:14 PM

Supreme Court Bench To Hear Stray Dog Case Tomorrow

ఢిల్లీ: వీధికుక్కలను షెల్టర్లకు తరలించాలని ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు పునఃసమీక్షించనుంది. గురువారం ఈ అంశంపై విచారణ చేపట్టనుంది.

దేశరాజధానిలో వీధికుక్కల స్వైరవిహారంతో విసిగిపోయిన సుప్రీంకోర్టు సోమవారం జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్ మహదేవన్‌ల  ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. రేబిస్ వ్యాధి, కుక్క కాటు,ప్రజల భద్రత అంశాలను పరిగణనలోకి తీసుకుని ఢిల్లీ వీధుల్లో ఒక్క కుక్క కూడా కనిపించకూడదని, షెల్టర్లకు తరలించాలని స్పష్టం చేసింది. ఆదేశాలను అడ్డుకునే ఏ సంస్థ అయినా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

అదే సమయంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధుల్లో ఆహారం పెట్టే ప్రేమికులు, తమ ఇంట్లోనే పెట్టొచ్చుగా? అని కోర్టు ప్రశ్నించింది. రేబిస్‌తో ప్రాణాలు కోల్పోయిన వారిని తిరిగి తీసుకురాగలరా? అంటూ జంతు హక్కుల కార్యకర్తలపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీధికుక్కలను దత్తత తీసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వొద్దని స్పష్టం చేసింది.

అయితే, ఈ తీర్పుపై వివాదం చెలరేగింది. జంతు ప్రేమికులు ఈ తీర్పును సవాలు చేశారు. సుప్రీంకోర్టులో పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశారు. వీధికుక్కల షెల్టర్లకు తరలింపుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ స్పందించారు. ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునసమీక్షిస్తామని తెలిపారు.

ఈ క్రమంలో బుధవారం ప్రధాన న్యాయమూర్తి గవాయ్ ఆదేశాల మేరకు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వీ అంజరియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును  రేపు విచారించనుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement