పారిపోయిన వాళ్లను పట్టుకొచ్చే హక్కు ప్రభుత్వానికి ఉంది | Supreme Court affirms the country right to extradite offenders | Sakshi
Sakshi News home page

పారిపోయిన వాళ్లను పట్టుకొచ్చే హక్కు ప్రభుత్వానికి ఉంది

Nov 27 2025 5:50 AM | Updated on Nov 27 2025 5:50 AM

Supreme Court affirms the country right to extradite offenders

రెడ్‌కార్నర్‌ నోటీస్‌ జారీని సమర్థించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: డజన్లకొద్దీ నేరాలను దర్జాచేసి విదేశాలకు పారిపోయిన వ్యక్తులను పట్టుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి సర్వాధికారం ఉందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. గుజరాత్‌కు చెందిన విజయ్‌ మురళీధర్‌ ఉద్వానీ తనపై నమోదైన 153 కేసులకు సంబంధించి జారీ అయిన రెడ్‌కార్నర్‌ నోటీస్‌ సంబంధ హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ దాఖలుచేసిన పిటిషన్‌ను విచారణకు తిరస్కరిస్తున్న ట్లు జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ధర్మాసనం ప్రకటించింది.

 ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలుచేసింది. 2022 జులైలోనే దుబాయ్‌కు పారిపోయిన మీపై రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ సరైందేనంటూ గతంలో గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాల్‌చేస్తూ ఉద్వానీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌నుద్దేశిస్తూ సుప్రీంకోర్టు.. ‘‘మీపై ఎన్నో ఆరోపణలు, 153 కేసు లు ఉన్నాయి. ముందు భారత్‌ రావాల్సిందే. వస్తే ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలుకుతారని అనుకో వద్దు’’ అని వ్యాఖ్యానించింది. 

తన పిటిషన్‌దారుకు తనపై 38 కేసుల వివరాలు కూడా తెలీదని అతని న్యాయవాది చెప్పారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.  ‘‘వివరాలు తెలీదంటే ఎలా? ట్ర యల్‌ కోర్టుకువెళ్లి సర్టిఫైడ్‌ కాపీల కోసం దరఖా స్తుచేస్తే వాళ్లే ఇస్తారు. ఇదేం రాకెట్‌ తయారీ శాస్త్రం కాదు. అతడిపై అరెస్ట్‌వారెంట్‌ జారీ అయింది’’ అని అన్నారు. ఎఫ్‌ఐఆర్‌లలోని వివరాలను అధికా రులు చెప్పడంలేదని లాయర్‌ వాదించగా ధర్మా సనం మళ్లీ ఆగ్రహం వ్యక్తంచేసింది. 

‘‘ ఎఫ్‌ఐఆర్‌ వివరాలు మీకు దుబాయ్‌లో పళ్లెంలో పెట్టి అందించాలా? ముందు భారత్‌కు రండి. వచ్చాక అధికారులు అన్ని వివరాలు అందిస్తారు’’ అని అన్నారు. ‘‘ అతని వద్ద ప్రస్తుతం పాస్‌పోర్ట్‌ లేదు. ఎలామరి?’’ అని ప్రశ్నించగా.. ‘‘ అంత కష్టపడకండి. అధికారులు అక్కడ అరెస్ట్‌చేసి తీసుకొస్తారులే’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ అతని తోటి నిందితుడు భారత్‌లో పోలీస్‌కస్టడీలో చనిపో యాడు. అందుకే నా పిటిషనర్‌ భారత్‌కు వచ్చాక సీసీటీవీ నిఘా ఉన్న గదిలోనే ఉంచాలి’’ అని లాయర్‌ కోరగా.. ‘‘ఇంక ఈ పిటిషన్‌ను విచారించలేం’’ అని ధర్మాసనం కోప్పడటంతో లాయర్‌ ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement