నా పిల్లలకింత విషం ఇవ్వండి | A Street Vendor Says Give Poison To My Children | Sakshi
Sakshi News home page

నా పిల్లలకింత విషం ఇవ్వండి

May 24 2021 6:03 PM | Updated on May 24 2021 7:02 PM

A Street Vendor Says Give Poison To My Children   - Sakshi

ఇండోర్‌: కరోనా వైరస్‌ ప్రజల ప్రాణాలు తీస్తుంటే ... లాక్‌డౌన్‌ కొందరి ఉపాధికి ఉరి వేస్తోంది. క్లిష్ట సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఉదాసీనత ప్రదర్శిస్తున్నాయి. ఫలితంగా చేయడానికి పని లేక .. తినడానికి తిండి లేక ఎంతో మంది సతమతం అవుతున్నారు. కరోనా రక్కసి తెచ్చిన ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ...   ఇంత విషం ఇవ్వండి  నాకు, నా పిల్లలకు అంటూ ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేశాడు ఓ తండ్రి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 

నా వల్ల కావట్లేదు
ఇండోర్‌కి చెందిన ఓ వీధి వ్యాపారి బండి మీద మామిడి పళ్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇండోర్‌లో ఏ మూలకు బండి పెట్టిన ఎవరో ఒక అధికారి వచ్చి అక్కడ నుంచి బండి తీయమంటున్నారు. మరోవైపు ఎండుకు మామాడి కాయలు వాడిపోతున్నాయి. కడుపులో పేగులు ఎండిపోతున్నాయి. ఇంతలో మున్సిపల్‌ అధికారులు వచ్చి మళ్లీ మామిడి పళ్ల బండి తీయాలంటూ చెప్పడంతో విసిగిపోయాడా చిరు వ్యాపారీ. చుట్టుముట్టిన కష్టాలను తట్టుకోలేక ...నాకింత విషం ఇవ్వండి నేను, నా పిల్లలు  తాగి చనిపోతానంటూ  బండిపై ఉన్న మామిడి కాయలన్నీ రోడ్డుపైనే పడేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో అతన్ని ఆదుకునేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. 

దిక్కుతోచని స్థితిలో
కరోనా కేసులు కంట్రోల్‌ కాకపోవడంతో మధ్యప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ విధించారు. అంతకు రెండు నెలల ముందే ఆ రాష్ట్ర వాణిజ్య రాజధాని ఇండోర్‌లో కర్ఫ్యూని అమలు చేశారు. దీంతో మూడు నెలలుగా ఇండోర్‌లో ఉన్న వీధి వ్యాపారులకు సరైన బేరాలు లేక ఇక్కట్లు పడుతున్నారు. లాక్‌డౌన్‌ నుంచి వెసులుబాటు ఉన్న కొద్ది సమయంలో వ్యాపారం చేసుందామని ప్రయత్నిస్తే అధికారులు అడ్డుతగులుతున్నారు. దీంతో దిక్కు తోచని స్థితిలోకి వీధి వ్యాపారులు నెట్టివేయబడుతున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement