ఢిల్లీలో శ్రీలంక అధ్యక్షుడికి ఘనస్వాగతం | Srilanka President Dissanayake 3 Day India Tour | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో శ్రీలంక అధ్యక్షుడికి ఘనస్వాగతం..మూడు రోజుల పాటు టూర్‌

Dec 15 2024 8:42 PM | Updated on Dec 15 2024 8:42 PM

Srilanka President Dissanayake 3 Day India Tour

న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటనలో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే భారత్‌ చేరుకున్నారు. ఆదివారం(డిసెంబర్‌15) సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయనకు కేంద్ర సహాయ మంత్రి మురుగన్‌ స్వాగతం పలికారు.

అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భారత్‌లో పర్యటిస్తున్న దిసనాయకేకు ప్రోటోకాల్‌ ప్రకారం స్వాగతం పలికినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ వెల్లడించారు.

 భారత్‌లో మూడు రోజుల పాటు (డిసెంబరు 15-17 వరకు) దిసనాయకే పర్యటన కొనసాగనుంది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం దిసనాయకే మనదేశంలో చేపట్టిన తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే. ఈ పర్యటనలో దిసనాయకే వెంట శ్రీలంక విదేశాంగ మంత్రి విజితా హెరాత్‌తోపాటు మరో మంత్రి అనిల్‌ జయంత ఫెర్నాండో కూడా ఉన్నారు.

పర్యటనలో తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో దిసనాయకే భేటీ కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటి అవుతారు. ప్రధానంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం,ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

కాగా శ్రీలంకలో సెప్టెంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అనుర కుమార దిసనాయకే విజయం సాధించిన విషయం తెలిసిందే.దేశ 9వ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. కొవిడ్‌ అనంతర పరిస్థితుల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న శ్రీలంక ఇప్పుడిప్పుడే అందులో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement