కోల్కతా: టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశారు. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎంపీ యూసుఫ్ పఠాన్ మధ్య ఎంపీ సీటు విషయమై తాను మధ్యవర్తిగా ఉన్నాననే వార్తలు పూర్తిగా అవాస్తవం అని కొట్టిపడేశారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని తానేప్పుడూ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని తెలిపారు.
పశ్చిమబెంగాల్లో 'దీదీ' పరిస్థితి నానాటికీ దిగజారుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడం.. అనంతరం ఆపార్టీలో తిరుగుబాటు మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై ఏసీబీ దాడులు ఇలా ఒకదాని తర్వాత మరో సమస్యలు మమతను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి పార్టీని చక్కదిద్దే యత్నం చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అందుకుగాను మాజీ క్రికెటర్ యూసప్ పఠాన్ తన సీటును త్యాగం చేయనున్నారని పుకార్లు చెలరేగాయి.
అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ ఎపిసోడ్కి మెుత్తం టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని మధ్యవర్తిగా నియమించారని ప్రచారం జరిగింది. అయితే ఈ వ్యవహారంపై గంగూలీ తాజాగా స్పందించారు "పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరపున నేను యూసుఫ్ పఠాన్ను సంప్రదించి, ఆమె ఆ నియోజకవర్గం నుండి జరగబోయే ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు వీలుగా..ఆయన తన పదవికి రాజీనామా చేయాలని మమతా తరపున సందేశాన్ని అందించానని ఆరోపణలు వచ్చాయి. అవన్నీ పూర్తిగా అవాస్తవాలు " అని గంగూలీ అన్నారు.
మమతా ఎప్పుడూ తనను ఇటువంటి రాజకీయ వ్యవహారాల చేరవేయాలని కోరలేదన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులతో తాను ఇదివరకూ ఏ సందర్భంలోనూ రాజకీయ విషయాలలో పాలుపంచుకోలేదని తెలిపారు. భారత మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ పశ్చిమ బెంగాల్లోని బహరంపూర్ లోక్సభ నియోజకవర్గం ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ తరపున ఈ స్థానం నుండి గెలుపొందారు.


