మైనింగ్ వివాదం తీవ్రరూపం
సిజిమాలి బాక్సైట్ తవ్వకాలకు మార్గం సుగమమయ్యేనా
రాయగడ : రాయగడలో బాక్సైట్ ఫైట్ తీవ్ర రూపం దాల్చుతోంది. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు కోసం కాశీపూర్లో గల టికిరిలో ఉత్కళ అల్యూమినియం కర్మాగారానికి 1994లో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎన్నో అభ్యంతరాలు, అవాంతరాలు, ప్రజల వ్యతిరేకతలు మధ్య 1996లో ప్రాజెక్టు పనులు పూర్తవ్వాల్సి ఉండగా అది 2006లో ప్రారంభమైంది. ఈ కర్మాగారం ఏర్పాటులో భాగంగా వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు సైతం త్యాగం చేశారు. అందుకు వారికి కర్మాగారం నష్టపరిహారం కూడా చెల్లించింది. ఇందులో భాగంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో ఇప్పటికీ ఈ ప్రాంతంలో వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి.
సిజిమాలి తవ్వకాలకు అనుమతి
కాశీపూర్ సమితి పరిధిలొని సగుబారి పంచాయతీలో గల కంఠమాల్ సమీపంలొ ఉన్న సిజిమాలి (Sijimali)లో సుమారు 311 మిలయన్ టన్నుల బాక్సైట్ నిక్షేపాలు దాదాపు 1549 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నట్లు గుర్తించిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సిజిమాలి కొండలో ఉన్న బాక్సైట్ తవ్వకాల కోసం 2023 వ సంవత్సరంలో వేదాంత కంపెనీకి 50 ఏళ్ల కోసం లీజ్ కింద అనుమతులు ఇచ్చింది. అయితే ఆది నుండే అవాంతరాలు ఏర్పడుతుండటంతో వేదాంత కంపెనీ తవ్వకాల కొసం ప్రయత్నించినా ఆ దిశగా ముందుకు వెళ్లలేకపోయింది. గ్రామ సభలు, పల్లెసభలను నిర్వహించిన అనంతరం ఆయా ప్రభావిత ప్రాంతాల ప్రజల అనుమతులతో తవ్వకాలను ప్రారంభించాల్సి ఉంది. అయితే ఎలాంటి గ్రామ సభలు, పల్లె సభలను నిర్వహించకుండా ప్రజల అభిమతం తెలుసుకోకుండా వేదాంత కంపెనీ తవ్వకాల కొసం కదం తొక్కినప్పటికీ దానికి అనుగుణంగా ముందుకు వెళ్లలేకపోయింది.
ఎందుకంత వ్యతిరేకత..?
కొండలనే తమ దైవంగా భావించే ఆదివాసీలు అడవులను నమ్ముకుని జీవనోపాధిని పొందుతుంటారు. మైనింగ్ తవ్వకాల వల్ల తాము దైవంగా భావించే కొండలు అంతరించిపోవడంతో పాటు పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని పచ్చని అడవులు నాశనం అవుతాయని భావించిన ఆదివాసీలు ఆది నుండే తవ్వకాలకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కొండలపై జీవించే ఎంతో మంది ఆదివాసీలు తమకు నిలువనీడ లేకుండా పోతుందని, అదేవిధంగా తాగునీటి వనరులు కూడా దొరకడం గగనమవుతుందని భావిస్తూ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.
పరిశ్రమలు ఏర్పాటైతే తమ జీవన స్థితిగతులు మెరుగుపడతాయని భావించి మొదట్లో కాశీపూర్లో గల ఉత్కళ అల్యూమినియం కర్మాగారం ఏర్పాటుకు ఆ ప్రాంత ప్రభావితమయ్యే గ్రామాలకు చెందిన ప్రజలు వారి భూములను, స్థలాలను అప్పగించారు. కానీ ఆ తర్వాత కూడా వలసలు ఆగలేదు. ఉన్న స్థలాల సైతం, నమ్ముకున్న అడవులసైతం ఇచ్చివేస్తే మిగిలేది ఏమీలేదని గట్టిగా నమ్మిన గ్రామస్తుల తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు.
సిజిమాలిలో జరిగింది ఇదే..
సిజిమాలి బాక్సైట్ నిక్షేపాలను తవ్వకాల కోసం వేదంత కంపెనీ సగుబారి నుంచి కంఠమాల్ గ్రామ సమీపంలో గల సిజిమాలి కొండవరకు రహదారిని నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. ఇందులో భాగంగా గ్రామస్తులు అందుకు అంగీకరించలేదు. దీంతో ఏప్రిల్ 7 వ తేదిన జిల్లా కలెక్టర్ అశుతొష్ కులకర్ణి కంఠమాల్ గ్రామ ప్రజలకు ఈ కొండను ప్రభుత్వం తవ్వకాల కొసం వేదాంత కంపెనీకి అనుమతులు ఇచ్చిందని, వారు తవ్వుకునేందుకు ఎలాంటి అభ్యంతరాలు తెలపకూడదని మైకు ద్వారా పోలీసులు బలగంతో అక్కడకు చేరుకున్న కలెక్టర్ గ్రామస్తులకు వివరించారు.

అదే రోజు రాత్రి పోలీసులు కంఠమాల్ గ్రామంలో గల సుభాసిణి మాఝి అనే ఒక నిందితురాలిని అరెస్టు చేసే పేరిట పూర్తి పోలీసుల బలగాలతో అర్ధరాత్రి గ్రామంలో దమన కాండను సృష్టించారు. ఈ దాడుల్లో ఎంతొ మంది ఆదివాసీలు గాయాలపాలయ్యారు. అదేవిధంగా గ్రామంలొకి భాష్వ వాయువును కూడా పోలీసులు ప్రయోగించారు. మరుసటి రోజు ఏప్రిల్ 8న మరికొంత మంది పోలీసులు ఉదయం కంఠమాల్ గ్రామానికి వెళ్లి రహదారి నిర్మాణానికి సంబంధించి సన్నాహాలు చేయగా గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. సంప్రదాయ ఆయుధాలతో వ్యతిరేకించారు. పోలీసులు, గ్రామస్తుల మధ్య జరిగిన వాగ్వాదంలొ పోలీసులపై గ్రామస్తులు రాళ్ల దాడి చేశారు. దీంతో సుమారు 58 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. దీంతొ పరిస్థితులు ఉద్రిక్తమవ్వడంతో గ్రామంలొ 163 సెక్షన్ జారీ చేశారు. కొద్ది రొజులు సద్దుమణగగా పరిస్థితులను అధ్యయనం చేసేందుకు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఒకరి తర్వాత ఒకరు గ్రామంలోకి వెళ్లారు. ఫ్యాక్ట్ పైండింగ్ టీంలుగా ఇటు ప్రతిపక్ష పార్టీ బీజేడీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలకు చెందిన అగ్రనాయకులు కంఠమాల్ గ్రామంలొ గ్రామస్తులతో సమావేశమయ్యారు. తాము అండగా ఉంటామని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. ఆదివాసీల హక్కులను కాలరాయడం విచారకరమని ఈ మేరకు తమ హైకమాండ్ లకు రాజకీయ నాయకులు నివేదికలను కూడా సమర్పించారు.
ఇందులో భాగంగా కొరాపుట్ లొక్సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వంలొ రాయగడ, బిసంకటక్, గుణుపూర్ ఎమ్మెల్యేలు అప్పల స్వామి కడ్రక, నీలమాధవ హికక, సత్యజీత్ గొమాంగొలు కంఠమాల్ గ్రామంలొ పర్యటించిన అనంతరం కలెక్టర్ అశుతొష్ కులకరి్ణతో సమావేశమయ్యారు. పల్లె సభలు, గ్రామ సభలను జరిగినట్లుగా సాక్ష్యాలను సృష్టించి వేదాంత కంపెనీ సిజిమాలి కొండలను తవ్వేందుకు ప్రయత్నిస్తుందని సరాసరి కలెక్టర్తో చెప్పారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఈ విషయమై చొరవ తీసుకొవాలని కొరారు. బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మందుకు తీసుకెళ్లాలని చూస్తుండగా ప్రతిపక్షపార్టీలు గ్రామస్తులకు మద్దతు చెబుతున్నాయి.
ఇదీ చదవండి: మీటింగ్లో అనుకోని అతిథి.. అవాక్కైన అధికారులు

ప్రభావిత గ్రామాలు
సిజిమాలి బాక్సైట్ తవ్వకాలు కొనసాగితే ప్రభావిత గ్రామాల గురించి తెలుసుకుంటే.. జిల్లాలోని 18 గ్రామాలు నేరుగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం, కంపెనీలు అంచనా వేశారు. ఇందులో రాయగడ జిల్లాలోని 8 గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే క్షేత్రస్థాయిలో పనిచేసే సామాజిక కార్యకర్తలు, గిరిజన సంఘాల అంచనా మేరకు మైనింగ్ వల్ల సుమారు 50 నుంచి 80 గ్రామాలు ప్రభావితమవుతాయని చెబుతున్నారు. దీని వల్ల సుమారు ఆయా గ్రామాలకు చెందిన దాదాపు 30 వేల మందికి పైగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని అంచనా.
ఇదీ చదవండి: మొగుడుమీద అలిగింది..నోట్ల వర్షం కురిసింది!


