కోజికోడ్: కేరళలోని కోజికోడ్ నగరంలో ఈరోజు (ఆదివారం) ఉదయం పెను కలకలం చెలరేగింది. కేవలం ఒక్క రూపాయి నోటు ఇస్తే విలువైన షూస్ ఉచితంగా ఇస్తామన్న ప్రకటన వేలాది మందిని అమితంగా ఆకర్షించింది. కొత్తగా ప్రారంభమైన ఒక పాదరక్షల దుకాణం ప్రచార ఆర్భాటం కాస్తా లాఠీచార్జీకి దారితీసింది. తొక్కిసలాటలో పలువురు చిన్నారులు గాయపడటం ఆందోళనకరంగా మారింది.
కోజికోడ్ నగరంలోని ప్రఖ్యాత మానంచిర ప్రాంతంలో ‘ట్రెండ్ ఫ్యాక్టరీ’ (Trend Factory) అనే కొత్త షూ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా యాజమాన్యం ఒక వినూత్న ప్రకటన చేసింది. పాత ఒక రూపాయి నోటుతో వచ్చే మొదటి 100 మంది వినియోగదారులకు బ్రాండెడ్ షూస్ ఉచితంగా అందిస్తామని, ఆ తర్వాతి 100 మందికి చేతి గడియారాలు బహుమతిగా ఇస్తామని ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.
ఈ ప్రకటన క్షణాల్లో వైరల్ కావడంతో, నగరంలోని ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో యువకులు, విద్యార్థులు, చిన్నారులు దుకాణానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిజానికి స్టోర్ ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, ఆఫర్ దక్కించుకునేందుకు జనం తెల్లవారుజామున 2 గంటల నుంచే క్యూ కట్టారు. దుకాణం దగ్గరకు వేల సంఖ్యలో జనం చేరుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది.
ఒకరినొకరు నెట్టుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన షోరూం నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు గుంపును నియంత్రించేందుకు ప్రయత్నించినప్పటికీ, జనం వెనక్కి తగ్గకపోవడంతో వారు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. ఈ తొక్కిసలాటలో, పోలీసుల లాఠీచార్జీలో పలువురు చిన్నారులకు గాయాలయ్యాయి. పోలీసులు స్టోర్ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు అనుమతులు లేకుండా, ఇలాంటి భారీ కార్యక్రమాలు నిర్వహించడంపై కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: రష్యాలో ఆఫ్రికన్ యువత మృత్యు ఘోష


