
న్యూఢిల్లీ: ప్రముఖ నటి, మోడల్ షెఫాలీ జరివాలా ఆకస్మిక మృతిపై జరుగుతున్న దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శుక్రవారం రాత్రి ఆమె మృతిచెందగా, అంత్యక్రియలు శనివారం సాయంత్రం ముంబైలో జరిగాయి. ఈ కార్యక్రమాలకు దగ్గరి కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు.
సాక్షుల వాంగ్మూలాలు, షెఫాలీ జరివాలా గదిలో నుంచి స్వాధీనం చేసుకున్న ఆధారాలు, ప్రాథమిక ఫోరెన్సిక్ ఇన్పుట్ల సాయంతో పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. షెఫాలీ గత ఏడెనిమిది ఏళ్లుగా క్రమం తప్పకుండా యాంటీ ఏజింగ్ మందులు తీసుకుంటున్నది. జూన్ 27న ఆమె ఇంటిలో పూజ జరిగింది. ఆరోజు షెఫాలీ ఉపవాసం ఉంది. అయినప్పటికీ ఆమె ఆ రోజు మధ్యాహ్నం యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకుంది. ఒక వైద్యుని సలహా మేరకు షెఫాలీ ఈ మందులను వాడుతోంది. పోలీసుల దర్యాప్తులో ఈ మందులే ఆమె గుండెపోటుకు ప్రధాన కారణం కావచ్చని వెల్లడయ్యింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూన్ 27న రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య షెఫాలీ ఆరోగ్యం క్షీణించింది. ఆమె శరీరంలో వణుకు మొదలైంది. తరువాత ఆమె అపస్మారక స్థితికి చేరింది. ఆమెను వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో షెఫాలీ భర్త పరాగ్, తల్లి, మరికొందరు ఆమెకు సాయం అందించారు. షెఫాలీ మృతి కేసు దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ బృందం ఆమె నివాసం నుండి యాంటీ ఏజింగ్ వైల్స్, విటమిన్ సప్లిమెంట్స్, గ్యాస్ట్రిక్ మాత్రలు మొదలైనవాటిని స్వాధీనం చేసుకుంది.
ఇప్పటివరకు, ఈ కేసులో కుటుంబ సభ్యులు, ఇంటి పనిమనుషులు, బెల్లేవ్ ఆసుపత్రి వైద్యుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక షెఫాలీ మృతికి గల కారణం స్పష్టం కానున్నదని పోలీసులు తెలిపారు. ఆమె శుక్రవారం రాత్రి ముంబైలోని తన నివాసంలో గుండెపోటుకు గురయ్యింది. ఆమె భర్త పరాగ్ త్యాగి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు షెఫాలీ మృతి చెందినట్లు ధృవీకరించారు.
ఇది కూడా చదవండి: కోల్కతా కేసు: మెడ, ఇతర భాగాలపై కమిలిన గాయాలు.. మెడికల్ రిపోర్టులో వెల్లడి