Former Lok Sabha MP Rahul Gandhi Vacate Delhi 12 Tughlak Lane House - Sakshi
Sakshi News home page

అనర్హత వేటు.. ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేసిన రాహుల్‌ గాంధీ

Apr 14 2023 6:27 PM | Updated on Apr 14 2023 6:42 PM

Rahul Gandhi Vacate Delhi 12 Tughlaq Lane House - Sakshi

సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. తనపై అనర్హత వేటు కారణంగా ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను శుక్రవారం ఖాళీ చేశారు. ఏప్రిల్ 22లోగా ఆయన తన బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‌సభ హౌజింగ్ కమిటీ గతంలోనే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ తన బంగ్లాను ఈరోజు ఖాళీ చేశారు. దీంతో, ఢిల్లీ 12 తుగ్లక్ లైన్‌లోని ప్రభుత్వ బంగ్లాలో ఉన్న ఆయన సామాన్లను ట్రక్కుల్లో తరలించారు. 

అయితే, పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు రాహుల్‌ గాంధీకి జైలు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో, వెంటనే రాహుల్‌పై అనర్హత వేటు పడింది. సూరత్ కోర్ట్ తీర్పు ప్రకారం లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై వెంటనే చర్యలకు దిగింది. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8లోని ఆర్టికల్ 102(1)(e) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కేరళలోని వయనాడ్ లోక్‌సభ సభ్యత్వం నుంచి అనర్హత వేటు పడింది. ఇదిలా ఉండగా.. రెండేళ్ల జైలుశిక్ష తీర్పును నిలిపేయాలని కోరుతూ దాఖలైన అప్పీలుపై సూరత్ సెషన్స్ కోర్టు ఏప్రిల్‌ 20వ తేదీన విచారణ చేపట్టనుంది. 

ఇక, రాహుల్ గాంధీ లోక్‌సభకు వరుసగా నాలుగోసారి ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ తొలిసారిగా అమెథీ నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో, ఆయనకు ఢిల్లీలోని తుగ్లక్‌ లేన్‌లో బంగ్లాను కేటాయించారు. నాటి నుంచి ఆయన అక్కడే నివాసం ఉంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement