
త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 2వ తేదీ నుంచి 8 రోజులపాటు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. బ్రెజిల్లోని రియోడీజనిరోలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్రంలో పాల్గొననున్న ప్రధాని మోదీ ఆ తర్వాత.. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, నమీబియాల్లో పర్యటించనున్నారని విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. మొదటగా జూలై 2, 3వ తేదీల్లో ఆఫ్రికా దేశం ఘనా వెళ్తారు.
ఈ దేశంలో ప్రధాని మోదీ మొట్టమొదటి పర్యటన ఇదే కాగా, మన ప్రధాని ఒకరు అక్కడ పర్యటించడం దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఇదే ప్రథమం. ఘనా నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగోకు వెళ్తారు. అక్కడ జూలై 3, 4వ తేదీల్లో పర్యటించనున్నారు. 1999 తర్వాత భారత ప్రధాని ఒకరు అక్కడికెళ్లడం ఇదే మొదటిసారి. అనంతరం, జూలై 4, 5వ తేదీల్లో అర్జెంటినా వెళ్తారు. జూలై 5 నుంచి 8 వరకు జరిగే 17వ బ్రిక్స్ సమిట్లో పాల్గొంటారు. చివరగా ప్రధాని మోదీ నమీబియా చేరుకుంటారు. మోదీ నమీబియాలో పర్యటించే మూడో భారత ప్రధాని కావడం గమనార్హం.