రైతులపై కృతజ్ఞత చూపాలని లేఖ...

Pm Modi Sent Wishes To  Former Punjab Chief Minister Parkash Singh Badal - Sakshi

న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, ఎన్డీయే మాజీ మిత్రపక్ష నేత ప్రకాష్ సింగ్ బాదల్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఉదయం ఆయనకు ఫోన్‌ చేసి విష్‌ చేశారు. కాగా మోదీ సర్కారు తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 93 ఏళ్ల బాదల్ రైతు నిరసనల గురించి సోమవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. అన్నదాతల పట్ల కృతజ్ఞత చూపించాలని, వారు వ్యతిరేకించే మూడు కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరారు. ఈ నాలుగు పేజీల లేఖలో బీజేపీ అగ్ర నాయకులలో ఒకరైన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి , ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితుల గురించి కూడా బాదల్‌ ప్రస్తావించారు.

"దేశాన్ని తీవ్ర గందరగోళంలోకి నెట్టివేసిన మూడు చట్టాలు ఉపసంహరించుకోవాలని, రైతులు, వారి కుటుంబాలను ఈ కొరికే చలిలో ఇబ్బంది పెట్టొద్దు. అత్యవసర రోజుల్లో నేను నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడాను. శాంతియుత ప్రజాస్వామ్య విలువల పట్ల గౌరవం సంక్లిష్ట, అవాంఛనీయ సమస్యలకు కూడా ఉత్తమ పరిష్కారాలను అందిస్తుందని నా అనుభవం  చెబుతుంది’’ అని ఆయన రాశారు. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో  వైఫల్యం చెందడం నమ్మడానికి కష్టంగా ఉందని ఆయన అన్నారు. "సంప్రదింపులు, సయోధ్య మరియు ఏకాభిప్రాయం ప్రజాస్వామ్యానికి పునాది. సంప్రదింపులు మాత్రమే ఏకాభిప్రాయానికి దారితీస్తాయి, ఏకాభిప్రాయం ప్రభుత్వానికి,రైతులకు మధ్య జరిగే గొడవలు నిలువరించడానికి గొప్ప మార్గం’’ అని బాదల్ లేఖలో పేర్కొన్నారు. కాగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ బీజేపీ మాజీ మిత్రపక్షాలలో ఒకటైన శిరోమణి అకాలీదళ్‌ ఇటీవల పార్టీతో విడిపోయింది. కాగా రైతులకు సంఘీభావంగా దేశంలో మూడవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌ని కూడా బాదల్ తిరిగి ఇచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top