నీతోనే ఉంటా.. చివరికి చావులో కూడా..

Orissa: Husband And Wife Killed By Thunder Lighting Farm Land Rayagada - Sakshi

పిడుగుపాటు గురై భార్యాభర్తలు మృతి 

కొడుకు, కోడలికి తీవ్రగాయాలు 

సాక్షి, భువనేశ్వర్‌(రాయగడ): పిడుగుపాటుకు గురై భార్యాభర్తలు మృతి చెందిన విషాద సంఘటన జిల్లాలోని బిసంకటక్‌ సమితి, కొరండిగుడ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇదే ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు హుటాహటిన ఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం వైద్యసేవల నిమిత్తం బిసంకటక్‌ ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు.

వివరాలిలా ఉన్నాయి.. కొరండిగుడకి చెందిన భార్యాభర్తలు మినియాక బుర్షా(56), మినియాక రామి(53), తమ కొడుకు కోడలు కస్తరి మినియాక(25), వలా మినియాక(29)లతో కలిసి ఉదయం పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన వీరంతా తలదాచుకునేందుకు అక్కడి ఓ చెట్టు కిందకు చేరారు.

క్షణాల్లో వారి ప్రాణాలు గాల్లో..
ఈ క్రమంలో అదే చెట్టుపై పడిన పిడుగుతో మినియాక బుర్షా, అతడి భార్య రామి మినియాక అక్కడికక్కడే మృతి చెందగా, వలా మినియాక, కస్తరి మినియాకలకు తీవ్రగాయలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని, పోలీసులు, అంబులెన్స్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులంతా ఇలా పడుగుపాటుకు గురవ్వడం పట్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: ఆంబులెన్స్‌ రాలేదు, నిండు గర్భిణిని 3 కిలోమీటర్ల వరకు..

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top