
న్యూఢిల్లీ: ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ భారత ప్రజాస్వామ్య ప్రస్థానానికి చాలా కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వలెంటీర్లు, యువత అందులో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇది వారి భవిష్యత్తుతో నేరుగా ముడిపడ్డ అంశమని గుర్తుంచుకోవాలన్నారు.
సోమవారం ఇక్కడ ఎన్సీసీ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘మన దేశంలో పదేపదే ఎన్నికలు జరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒక మూల ఎన్నికల వాతావరణం నెలకొని ఉంటోంది. దాంతో పాలన, అభివృద్ధి పనుల వేగం మందగిస్తోంది. లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలూ ఒకేసారి జరిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
మొదట్లో దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరిగేవి. తర్వాతి కాలంలో ఆ ప్రక్రియకు విఘాతం కలిగింది. అమెరికా వంటి అగ్ర రాజ్యాల్లో ఎన్నికలు నిరీ్ణత కాలావధిలోనే జరుగుతాయి’’ అని గుర్తు చేశారు. కనీసం లక్షమంది యువతీ యువకులు రాజకీయాల్లోకి రావాలని పునరుద్ఘాటించారు. ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలోనూ ఇదే మాట చెప్పానని గుర్తు చేశారు.