మహిళా బిల్లును అడ్డుకున్న పాపం విపక్షాలదే.. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై మోదీ నిప్పులు
నారీశక్తి ఆకాంక్షలను కర్కశంగా నలిపేశాయి
భ్రూణహత్యతో పాపం మూటగట్టుకున్నాయి
దీన్ని దేశ మహిళలు ఎప్పటికీ మర్చిపోలేరు
వాటికి మర్చిపోలేని గుణపాఠం నేర్పుతారు
బిల్లు వీగిపోయినందుకు ఎంతగానో దుఃఖించా
మహిళలందరికీ క్షమాపణలు చెబుతున్నా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని
రిజర్వేషన్ల అమలుకు పోరాడతానని వెల్లడి
న్యూఢిల్లీ: నారీ శక్తికి చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం దక్కాలన్న పవిత్రమైన ఆశయంతో తెచ్చిన మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును ఓడించిన పాపం పూర్తిగా విపక్షాలదేనంటూ ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. వాటి ముసుగు తొలగి అసలు రంగు బయట పడిందన్నారు. ‘‘మా ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ప్రయత్నించినా బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందలేకపోయాం. ఇందుకు దేశ మహిళలందరితో పాటు నేను కూడా ఎంతగానో దుఃఖిస్తున్నా. వారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా’’అని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 నుంచే అమల్లోకి తెచ్చేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు శుక్రవారం లోక్సభలో వీగిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని శనివారం రాత్రి జాతినుద్దేశించి 30 నిమిషాల పాటు ప్రసంగించారు. ‘‘కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ తదితర విపక్షాలు దేశ మహిళల చిరకాల ఆకాంక్షను అత్యంత కర్కశంగా నలిపేశాయి. బిల్లును ఓడించడం ద్వారా భ్రూణ హత్యకు పాల్పడ్డాయి. పైగా అందుకు నిండు సభలోనే సంబరాలు చేసుకున్నాయి. బల్లలను చరుస్తూ హర్షాతిరేకాలు వెలిబుచ్చాయి. మహిళల ఆత్మగౌరవాన్ని అత్యంత దారుణంగా గాయపరిచాయి’’అంటూ తూర్పారబట్టారు. మహిళల ఆకాంక్షలను ఆ పార్టీలు కాలరాసిన తీరును దేశ పౌరులంతా గమనిస్తూనే ఉన్నారన్నారు. ‘‘విపక్షాల పాపానికి ఎన్నటికీ నిష్కృతి లేదు. అందుకు తగిన శిక్ష అనుభవించక తప్పదు.
మహిళా శక్తిని విపక్షాలు తేలిగ్గా తీసుకుంటున్నాయి. కానీ భారత మహిళ దేన్నయినా మర్చిపోతుందేమో గానీ తన ఆత్మగౌరవాన్ని కించపరిస్తే మాత్రం సహించబోదు. రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్, సమాజ్వాదీ తదితర పార్టీలు తలపెట్టిన ద్రోహాన్ని మహిళలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అవి ఎన్నటికీ మర్చిపోలేని రీతిలో గట్టి గుణపాఠం చెప్పి తీరతారు’’అని మోదీ స్పష్టం చేశారు. మహిళా సాధికారతకు పట్టం కట్టేందుకు జరుగుతున్న కృషి విపక్షాల స్వార్థ రాజకీయాల కారణంగా నిలిచిపోయే పరిస్థితి నెలకొందంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘లోక్సభలో మాకు సంఖ్యా బలం లేకపోయింది. అయినా నిరాశ పడబోం. మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు, రిజర్వేషన్ల చట్టం సత్వర అమలుకు బీజేపీ, ఎన్డీఏ కూటమి చిత్తశుద్ధితో పోరాడుతూనే ఉంటాయి. ఆ మార్గంలో నెలకొన్న ప్రతి అడ్డంకినీ తొలగించి తీరతాం’’అని ప్రకటించారు. ‘‘పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి అవసరమైన 66 శాతం ఓట్లను మేం సాధించలేకపోవచ్చు. కానీ దేశ మహిళల ఆశీర్వాదాలు మాత్రం 100 శాతం మాతోనే ఉన్నాయి’’అని ప్రధాని పేర్కొన్నారు.
పునాదులు కదులుతాయని భయం!
కుటుంబాల చెప్పుచేతుల్లో నడిచే కాంగ్రెస్, డీఎంకే, సమాజ్వాదీ వంటి పార్టీలు మహిళల ఎదుగుదలను సహించలేవని మోదీ ఆరోపించారు. ‘‘మహిళలను ఎదగనిస్తే తమ స్వార్థ రాజకీయ పునాదులు పూర్తిగా కదిలిపోతాయని వాటి భయం. అధికారం ఎప్పటికీ తమ కుటుంబానికే పరిమితం కావాలని కోరుకుంటాయి. తమ కుటుంబంలోని మహిళలు తప్ప దేశ మహిళల రాజకీయ ఎదుగుదల సహించలేవు’’అంటూ ఎద్దేవా చేశారు. జనాభాలో సగభాగమైన మహిళలకు చట్టసభల్లో కూడా సముచిత ప్రాధాన్యం దక్కడం తక్షణావసరమని ఆయన పునరుద్ఘాటించారు. మహిళా రిజర్వేషన్ల అంశం 40 ఏళ్లుగా పెండింగ్లోనే ఉందని గుర్తు చేశారు. ‘‘అందుకే మహిళల సమున్నత ఆకాంక్షలకు రెక్కలు తొడిగే ఉదాత్త లక్ష్యంతోనే సవరణ బిల్లు తెచ్చాం. ఆ క్రమంలో ఎవరికీ ఎలాంటి అన్యాయమూ జరగకుండా జాగ్రత్త పడ్డాం. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర... ఇలా ప్రాంతాలవారీగా సమతుల్యతతో దెబ్బతినకుండా నిజాయతీతో కృషి చేశాం.
లోక్సభలో ప్రతి రాష్ట్రానికీ ప్రస్తుతమున్న ప్రాతినిధ్యం సంఖ్యాపరంగానే గాక నైష్పత్తికంగా కూడా యథాతథంగా కొనసాగేలా చూశాం. ఇదే విషయాన్ని విపక్షాలన్నింటికీ పదేపదే చెప్పాం. అయినా దేశ హితం, మహిళా సాధికారత కంటే స్వార్థానికే అవి పెద్దపీట వేశాయి. బిల్లును ఓడించడం ద్వారా రాజ్యాంగాన్ని కూడా అవమానించాయి. రాజ్యాంగం ముందు, దేశ మహిళా శక్తి ముందు నేరస్తులుగా నిలబడ్డాయి’’అంటూ మండిపడ్డారు. ‘‘లోక్సభ స్థానాల పెరుగుదలతో తమిళనాడు, పశ్చమబెంగాల్ గొంతుకను పార్లమెంటులో మరింతగా విన్పించే సువర్ణావకాశం అక్కడి అధికార పార్టీలు డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్కు వచ్చింది. దాన్ని అవి కాలదన్నాయి’’అంటూ ప్రధాని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘21వ శతాబ్దపు మహిళలు దేశంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్నీ నిశితంగా గమనిస్తున్నారు. విపక్షాల అసలు ఉద్దేశాలను వారు అర్థం చేసుకుంటున్నారు’’అంటూ హెచ్చరించారు.
పరాన్నజీవిలా కాంగ్రెస్!
కాంగ్రెస్పై ప్రధాని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. దేశ ప్రగతికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ ఆ పార్టీది ఆది నుంచీ ప్రతికూల భావజాలమేనంటూ దుయ్యబట్టారు. దేశ వెనకబాటుకు, అది ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ కాంగ్రెసే ఏకైక కారణమని ఆరోపించారు. ‘‘సంస్కరణలకు కాంగ్రెస్ నిత్య వ్యతిరేకి. ఆ పేరు వింటేనే ఉలిక్కిపడుతుంది. జాతి నిర్మాణానికి, మెరుగుదలకు ఉద్దేశించి ప్రతి ప్రయత్నాన్నీ అడ్డుకుంటూ వచ్చిన చరిత్ర కాంగ్రెస్ది. దశాబ్దాలుగా ప్రతి సంస్కరణనూ వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంది. జన్ధన్ యోజన మొదలుకుని ఆధార్, డిజిటల్ చెల్లింపులు, జీఎస్టీ దాకా ఇందుకు తార్కాణాలెన్నో. ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకు రిజర్వేషన్లను, ఆర్టికల్ 370, త్రిపుల్ తలాక్ రద్దునూ కాంగ్రెస్ గుడ్డిగా వ్యతిరేకించింది’’అంటూ ఆక్షేపించారు. ‘‘దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నానాటికీ బలహీనపడుతోంది.
ప్రజాదరణ, సొంత బలం కోల్పోయి ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి పరాన్నజీవిలా మనుగడ సాగిస్తోంది. కానీ ఆ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనూ బలోపేతం కావొద్దని కోరుకుంటోంది’’అంటూ ఎద్దేవా చేశారు. ‘‘మహిళా రిజర్వేషన్ల బిల్లును కూడా 40 ఏళ్లుగా కాంగ్రెస్ గుడ్డి వ్యతిరేకిస్తోంది. సవరణ బిల్లుకు మద్దతిచ్చి ఆ తప్పిదాలను సరిచేసుకుంటుందని, కొత్త చరిత్ర లిఖిస్తుందని ఆశించా. కానీ ఆ చరిత్రాత్మక అవకాశాన్ని కాంగ్రెస్ పోగొట్టుకుంది. ఆ పార్టీ నమ్ముకున్నది విభజన రాజకీయాలను మాత్రమే. అందుకే ఉత్తరాది, దక్షిణాది విభజన అంటూ డీలిమిటేషన్పై అవాస్తవాలను ప్రచారం చేసింది’’అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రతికూల భావజాలానికి దేశ మహిళలు తగిన రీతిలో బదులిచ్చి తీరతారని హెచ్చరించారు.


