సాక్షి, చెన్నై: తమిళనాడులోని ప్రముఖ బాణాసంచా తయారీ కేంద్రమైన శివకాశిలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక బాణాసంచా ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో అక్కడ సుమారూ 20 మందికి పైగా కార్మికులు విధులు నిర్వహిస్తూ మంటల్లో చిక్కుకుపోయినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
ఈ పేలుడు ధాటికి సదరు బాణాసంచా గోడౌన్తో పాటు దాని పక్కనే ఉన్న మరో నాలుగు గోడౌన్లు మరియు చుట్టుపక్కల ఉన్న 10కి పైగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘోర ప్రమాదంలో గోడౌన్లో పనిచేస్తున్న పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో చిక్కుకున్న మిగిలిన కార్మికులను రక్షించేందుకు శ్రమిస్తున్నారు.
కాగా, గాయపడిన బాధితులను అత్యవసర చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది


