జేబులో ఉల్లిపాయ‌తో ఎండ‌వేడి మాయం | Keep Onion In Your Pocket: Jyotiraditya Scindia Summer Advice | Sakshi
Sakshi News home page

ఉల్లిపాయతో ఉష్ణం.. హుష్ కాకి: కేంద్ర మంత్రి

Apr 27 2026 2:29 PM | Updated on Apr 27 2026 2:58 PM

Keep Onion In Your Pocket: Jyotiraditya Scindia Summer Advice

ఎండ‌ల‌కు త‌ట్టుకోలేక ఏసీ వాడుతున్నారా?  వేడి నుంచి ఉప‌శ‌మ‌నం కోసం శీత‌ల పానీయాల‌ను ఆశ్ర‌యిస్తున్నారా? ఇవేవి అవ‌స‌రం లేకుండా అధిక ఉష్ణోగ్ర‌త‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొందాల‌ని భావిస్తున్నారా? అయితే మీ జేబుల్లో ఒక ఉల్లిపాయ పెట్టుకోండి చాలు. దెబ్బ‌కు ఉష్ణం దూదిపింజలా ఎగిరిపోతుంది. ఏంటి జేబులో ఉల్లిపాయ ఉంటే వేడి త‌గ్గుందా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అవుననే బ‌ల్ల‌గుద్ది చెబుతున్నారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. 

శివపురి: ఎండా కాలంలో అధిక వేడి నుంచి ఉప‌శ‌మనం పొంద‌డానికి ఉల్లిపాయ చాలంటున్నారు కేంద్ర స‌మాచార శాఖ‌ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. జేబులో ఉల్లిపాయ ఉంటే చాలు ఉష్ణం.. హుష్ కాకి అవుతుంద‌ని ఆయ‌న చెప్పారు. అందుకే ఎండాకాలంలో త‌న జేబులో ఎప్పుడూ ఉల్లిపాయ ఉంటుంద‌ని వెల్ల‌డించారు. అధిక ఉష్ణోగ్రతలను ఎలా ఎదుర్కొంటారనే విషయంపై మాట్లాడుతూ ఆయ‌నీ విష‌యాలు చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఓ స‌భ‌లో ఆదివారం ఈ వ్యాఖ్య‌లు చేశారు.

కారులో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు తాను ఏసీ వాడ‌న‌ని జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అలాగే ఏసీకి దూరంగా కూర్చుంటాన‌ని చెప్పారు. ''నేను నా కారులో ఏసీ వాడను, ఏసీ ఉన్న చోట కూర్చోను కూడా. మే, జూన్ నెలల్లో 51 డిగ్రీల వేడిలో ఏసీ లేకుండా ఉంటార‌నిజ‌నం న‌న్ను అడుగుతుంటారు. నాది 'చంబల్ చర్మం' అని చెబుతుంటాను. ఇంకో విషయం కూడా చెబుతాను. నేను చూడటానికి కొంచెం చిన్న వ‌య‌స్కుడిలా కనిపిస్తాను, కానీ నా ఆత్మ చాలా పురాతనమైనది. మీ జేబులో ఒక ఉల్లిపాయ ఉంచుకోండి. మీకేమీ కాదు. సమాచార శాఖ మంత్రిగా ఉన్న నేను కూడా ఎప్పుడూ ఉల్లిపాయ వెంట ఉంచుకుంటాను. ఇవి పాత విషయాలు. ఆయుర్వేదం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, మనం ఈ విషయాలను మర్చిపోకూడద''ని అన్నారు.

నెటిజ‌నుల స్పంద‌న‌
జ్యోతిరాదిత్య సింధియా వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌నులు మండిపడుతున్నారు. వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం పొందే ప్ర‌ణాళిక‌ల గురించి ప్ర‌జ‌లు అడిగితే కేంద్ర మంత్రి ఏదేదో చెబుతున్నార‌ని ఫైర్ అవుతున్నారు. వేడి నివారణ ప్రణాళికలు, మెరుగైన వ్యవస్థల గురించి ప్రజలు అడిగితే.. బదులుగా వారికి ఉల్లిపాయల వంటి తాత్కాలిక పరిష్కారాలు లభిస్తున్నాయి. ఈ దశలో, అది 'పాత ఆత్మ' కాదు.. అస‌లు ఆత్మే లేదు. అందుకే మన మంత్రులకు కూడా విద్య ముఖ్యమ‌ని ఒక నెటిజ‌న్ కామెంట్ చేశారు.

చ‌ద‌వండి: కేజ్రీవాల్‌కు షాక్‌.. చ‌ద్దాకు జాక్‌పాట్‌?

తామేం చెప్పినా ప్ర‌జ‌లు న‌మ్ముతార‌నే ఉద్దేశంతోనే రాజకీయ నాయకులు ఇలాంటివి ప్ర‌చారం చేస్తుంటార‌ని మ‌రో నెటిజ‌న్ వ్యాఖ్యానించారు. కారులో ఏసీ లేకుండా నిమిషం కూడా ఉండ‌లేమ‌న్నారు. ఏసీ కింద ఆయ‌న కూర్చున్న ఫొటోల‌ను కొంత‌మంది షేర్ చేసి సెటైర్లు పేలుస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement