కర్ణాటకలోని శిరహట్టి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లమానీ లంచం తీసుకుంటూ లోకాయుక్తా పోలీసులకు చిక్కాడు. మైనర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఓ రిటైనింగ్ వాల్ నిర్మాణం కాంట్రాక్ట్ కోసం పూజారి అనే క్లాస్-1 కాంట్రాక్టర్ చంద్రు లమానీని సంప్రదించారు. అయితే కాంట్రాక్ట్ మంజూరు చేయడం కోసం ఆయన రూ.11 లక్షల డిమాండ్ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్ లోకాయుక్తా పోలీసులను ఆశ్రయించాడు.
అతడి ఫిర్యాదుతో ధార్వాడ్ లోకాయుక్తా ఎస్పీ సిద్ధలింగప్ప నేతృత్వంలో పోలీసులు పత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో మొదటి విడతలో భాగంగా రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండడగా చంద్రు లమానీని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన పీఎ మంజునాథ్ వాల్మీకి, ప్రైవేట్ అసిస్టెంట్ గురు లమానిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే లమానీ నివాసం, కార్యాలయాల్లో లోకాయుక్త పోలీసులు సోదాలు చేపట్టారు. ఇదే విషయంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాగా 2023లో కూడా మరో బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు రూ. 40 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన సంగతి తెలిసిందే.


