బుర్ఖాలో వచ్చాడు.. నడకతో దొరికిపోయాడు | Kanpur Man Gold Chain Burqa Walking Case Shocking Details | Sakshi
Sakshi News home page

బుర్ఖాలో వచ్చాడు.. నడకతో దొరికిపోయాడు

Jun 6 2026 10:37 AM | Updated on Jun 6 2026 11:51 AM

Kanpur Man Gold Chain Burqa Walking Case Shocking Details

స్నేహితుడి మెడలో ఐదు తులాల బంగారంపై కన్నేశాడు. ఎలాగైనా కాజేయాలని నెలల తరబడి ఎదురు చూశాడు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఏం చేయాలి.. ఎలా తప్పించుకోవాలి అని స్కెచ్‌ గీశాడు. ప్లాన్‌ అమలు చేసే టైంలో.. కంగారుపడడంతో ఊహించనిది జరిగింది. అయినా బెదరలేదు. ఎవరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. చివరకు.. సీసీటీవీలో దొరికిన ఒక చిన్న క్లూ చివరకు అతడిని కటకటాల వెనక్కి నెట్టింది.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ప్రకాశ్‌ చంద్ర గుప్తా కంప్యూటర్‌ కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. అతనికి మోహిత్‌ ద్వివేది అనే వ్యక్తితో 18 ఏళ్ల స్నేహం ఉంది. అయితే ఆ స్నేహానికే చివరికి డబ్బు, బంగారం చిచ్చుపెట్టాయి. ప్రకాశ్‌ ధరించే సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు గొలుసుపై మోహిత్‌ కన్నేశాడు. దానిని ఎలాగైనా దోచుకోవాలని నిర్ణయించుకున్న అతడు ముందుగానే పథకం రచించాడు.

ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతున్న మే 31 రాత్రి ప్రకాశ్‌ తన కోచింగ్‌ సెంటర్‌లోనే ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు బుర్ఖా ధరించడంతో పాటు మహిళలు ఉపయోగించే ఆభరణాలు, చెప్పులు కూడా వేసుకున్నాడు. అనంతరం కోచింగ్‌ సెంటర్‌లోకి ప్రవేశించి ప్రకాశ్‌పై దాడికి దిగాడు. బంగారు గొలుసు లాక్కునే ప్రయత్నంలో ఇద్దరి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది.

ఈ క్రమంలో ప్రకాశ్‌ను బలంగా తోసేయడంతో అతడు నేలపై పడిపోయి తలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కారణంగా అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మోహిత్‌ బంగారు గొలుసుతో పాటు మరో బంగారు బ్రాస్‌లెట్‌ను కూడా తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం ప్రకాశ్‌ కుటుంబ సభ్యులు అతడి మృతదేహాన్ని రక్తపు మడుగులో గుర్తించారు. తొలుత పోలీసులు ప్రమాదవశాత్తూ పడిపోవడం వల్ల మరణించి ఉండొచ్చని భావించారు. అయితే బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఒక చోట ఒకరు బుర్ఖాలో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ మనిషి నడక మాత్రం తేడాగా కనిపించింది. దీంతో బుర్ఖాలో ఉంది మహిళ కాదేమోనని అనుమానపడ్డారు. అలాగే.. అక్కడి నుంచి సుమారు 100 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ ఆ ముసుగు వ్యక్తి కదలికలను ట్రాక్‌ చేశారు. చివరకు ఒక కారులో.. బుర్ఖా మార్చుకుంటూ ఆ వ్యక్తి బయటపడ్డాడు. అది మోహిత్‌ అని గుర్తించి షాక్‌ తిన్నారు.

పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించిన మోహిత్‌.. హత్య తర్వాత కూడా ఎలాంటి అనుమానం రాకుండా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించినట్లు వెల్లడైంది. అంతేకాకుండా నేరం జరిగిన మరుసటి రోజే ఓ పోటీ పరీక్షకు హాజరై, తర్వాత లక్నోకు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనతో ప్రకాశ్‌ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. "18 ఏళ్ల స్నేహాన్ని డబ్బు కోసం బలి చేశాడు. ఇంత దారుణంగా మోసం చేస్తాడని ఊహించలేదు" అని మృతుడి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement