న్యూఢిల్లీ: భారతదేశం 2005లోనే జాతీయ స్థాయిలో కుష్టు వ్యాధి (లెప్రసీ) నిర్మూలన లక్ష్యాన్ని సాధించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కుష్టు వ్యాధి కేసుల్లో దాదాపు 50 శాతం కేసులు కేవలం ఐదు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతం కావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం.. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ వ్యాధికి ప్రధాన కేంద్రాలుగా మారాయి. వ్యాధి వ్యాప్తిని పూర్తిగా అరికట్టడానికి ఇప్పుడు యుద్ధప్రాతిపదికన ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది.
ఐదు రాష్ట్రాల్లో హై-అలర్ట్..
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఆరాధన పట్నాయక్ ఛత్తీస్గఢ్లోని నవ రాయ్పూర్లో జరిగిన ప్రాంతీయ సమీక్షా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఛత్తీస్గఢ్లో 23, జార్ఖండ్లో 21, మహారాష్ట్ర ఒడిశాలలో 18 చొప్పున, అలాగే మధ్యప్రదేశ్లో 10 జిల్లాలు అధిక వ్యాప్తి రేటును కలిగి ఉన్నాయి. ప్రతి 10,000 మంది జనాభాకు ఒకరి కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రాల ఉప-జాతీయ స్థాయిలో ఈ మహమ్మారి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని ఆమె పేర్కొన్నారు.
గత ఏడాది 91 వేల కొత్త కేసులు
ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం 2025-26 కాలంలో దేశంలో ఏకంగా 91,783 కొత్త కుష్టు వ్యాధి కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం దేశంలో వ్యాప్తి రేటు ప్రతి 10,000 మంది జనాభాకు 0.56 గా ఉంది. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ కొత్త కేసుల్లో 4.18 శాతం మంది చిన్న పిల్లలు కాగా, 2.12 శాతం మంది రోగులు వ్యాధి నిర్ధారణ సమయానికే ‘గ్రేడ్-2’ వైకల్యంతో బాధపడుతున్నారు. వ్యాధి ముందస్తు గుర్తింపులో లోపాలు, ఆలస్యంగా చికిత్స అందడం వంటి సవాళ్లను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
అడ్డంకులను అధిగమించి..
ఈ మహమ్మారిని పూర్తిగా రూపుమాపేందుకు అంతర్-రాష్ట్ర సహకారం, ముందస్తు రోగ నిర్ధారణ, నిరంతర నిఘా అవసరమని అధికారులు తెలిపారు. కుష్టు వ్యాధి సోకిన వారితో పరిచయం ఉన్న ఆరోగ్యవంతులకు ఒకే మోతాదు ‘రిఫాంపిసిన్’ ఔషధాన్ని అందించడం ద్వారా వ్యాప్తిని అడ్డుకోవాలని సూచించారు. మరోవైపు, నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సునీల్ వి. గిట్టే మాట్లాడుతూ.. వైకల్య నివారణలో భాగంగా ఇప్పటివరకు 1,591 పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు చేశామని, లక్షకు పైగా ప్రత్యేక మైక్రో సెల్యులార్ రబ్బర్ పాదరక్షలను పంపిణీ చేశామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ట్రంప్ వేట.. వెనిజువెలా డ్రగ్ లార్డ్ హతం


