
రెండో స్థానంలో అమెరికా
13.5% యూజర్లతో ప్రపంచంలో టాప్
10.8 కోట్లకు చేరిన వినియోగదారులు
డీప్సీక్ వినియోగంలోనూ టాప్–3లో
భారతీయుల జీవితంలో ఏఐ మమేకం
వాడకం అంటే మనవాళ్లదే. రెండేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన ‘చాట్జీపీటీ’ భారతీయులకు అత్యంత ఇష్టమైన యాప్గా అవతరించింది. చాట్జీపీటీ వినియోగంలో ప్రపంచంలో 13.5% మంది యూజర్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అమెరికాను కూడా వెనక్కి నెట్టి ఔరా అనిపించింది. చాట్జీపీటీ వినియోగదారుల సంఖ్య భారత్లో 10.8 కోట్లకు చేరుకుంది. దీన్ని బట్టి భారతీయుల జీవితాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎలా మమేకం అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. – సాక్షి, స్పెషల్ డెస్క్
టెక్నాలజీ వాడకంలో మనవాళ్లను కొట్టేవారే లేరని మరోసారి నిరూపితమైంది. చాట్జీపీటీ యూజర్లలో భారతీయులు నంబర్వన్గా నిలిచారు. అమెరికా కూడా మన తరవాతే ఉంది. యూఎస్ వాటా 8.9% మాత్రమే. ఇండోనేసియా 5.7, బ్రెజిల్ 5.4, ఈజిప్ట్ 3.9, మెక్సికో 3.5, పాకిస్తాన్ 3, జర్మనీ 3, ఫ్రాన్స్ 2.9, వియత్నాం 2.6% వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఏఐ ఆధారిత ఈ చాట్బాట్ సాంకేతిక నిపుణులకు మాత్రమే పరిమితం కాలేదు. విద్యార్థులు, కంటెంట్ క్రియేటర్స్కు తోడు సామాన్యులూ మన దేశంలో తెగ వాడేస్తున్నారు. హోంవర్క్లో సహాయం, మనసుకి నచ్చిన వారికి సందేశం, కావాల్సిన సమాచారాన్ని సేకరించడం, కంటెంట్ క్రియేషన్ .. అవసరం ఏదైనా అమెరికన్ కంపెనీ రూపొందించిన ఈ చాట్బాట్ వేగంగా భారత్లో విస్తరిస్తోందని క్వీన్ ఆఫ్ ది ఇంటర్నెట్గా ప్రసిద్ధి చెందిన విశ్లేషకురాలు, వెంచర్ క్యాపిటలిస్ట్ మేరీ మీకర్ తన ‘2025 ఏఐ ట్రెండ్స్’ నివేదికలో తెలిపారు.
అంతేగాక చైనా తయారీ ఏఐ చాట్బాట్ ‘డీప్సీక్’ వినియోగంలోనూ భారతీయులు మూడో స్థానంలో నిలిచారు. ప్రపంచ వినియోగదారుల్లో 6.9 శాతం మంది మనదేశం నుంచే ఉన్నారు. 33.9% వాటాతో చైనా, 9.2%తో రష్యా టాప్–2లో ఉన్నాయి. డీప్సీక్ మొత్తం వినియోగదార్ల సంఖ్య 5.4 కోట్లు.
తెలుగులోనూ వినియోగం..
ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరగడం, బలమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిశ్రమ, డిజిటల్ పరివర్తనకు ప్రభుత్వ మద్దతు, ప్రాంతీయ భాషలపై దృష్టి పెట్టడం వంటి వివిధ అంశాలు ఏఐ వినియోగంలో ఈ పెరుగుదలకు కారణమని నివేదిక వెల్లడించింది.
చాట్జీపీటీ తెలుగు, హిందీ, మలయాళం, తమిళం వంటి అనేక భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. అంటే మనకు కావాల్సిన సమాచారాన్ని తెలుగులోనూ అందిస్తుందన్నమాట. స్మార్ట్ఫోన్లు అందుబాటు ధరల్లో లభించడం, ఇంటర్నెట్ వేగం దూసుకెళ్లడం కూడా చాట్జీపీటీ వాడకం అధికం కావడానికి ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు.
రోజుకు 100 కోట్లకుపైగా..
చాట్జీపీటీ వేదికగా రోజుకు 100 కోట్లకుపైగా సర్చెస్ నమోదవుతున్నాయంటే నోరెళ్లబెట్టాల్సిందే. వార్షిక సర్చెస్ 36,500 కోట్లకు చేరుకోవడానికి గూగుల్కు 11 ఏళ్ల సమయం పడితే.. చాట్జీపీటీ ఈ మైలురాయిని 5.5 రెట్లు వేగంగా రెండేళ్లలోనే అందుకుంది. 2022 నవంబర్ 30న రంగ ప్రవేశం చేసిన చాట్జీపీటీ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినోదం, ఆటల కోసం కాకుండా నేర్చుకోవడానికి, రాయడానికి, కోడింగ్ కోసం, కంటెంట్ క్రియేట్ చేయడానికి దీనిని ఉపయోగిస్తున్నందున ప్రజాదరణ విపరీతంగా పెరిగింది. చాట్జీపీటీకి అంతర్జాతీయంగా 80 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లున్నారు. 21 నెలల క్రితంతో పోలిస్తే చాట్జీపీటీ యాప్లో మూడు రెట్లు ఎక్కువ సమయాన్ని యూజర్లు వెచ్చిస్తున్నారు.

చెల్లించేందుకూ సిద్ధం..
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. చాట్జీపీటీ పెయిడ్ సబ్స్క్రైబర్ల సంఖ్య గణనీయంగా పెరిగి 2 కోట్లు దాటింది. ఈ సంఖ్య సంవత్సరానికి 153 శాతం చొప్పున దూసుకెళుతోంది. ఈ ప్లాట్ఫామ్ మాతృ సంస్థ అయిన ఓపెన్ ఏఐకి పెద్ద మొత్తంలో ఆదాయ వనరుగా అవతరించింది. ఏడాదిలోనే ఈ మొత్తం పది రెట్లు పెరిగింది. చాట్బాట్ ఒక్కటే కంపెనీకి ఏటా రూ.31,709 కోట్ల ఆదాయాన్ని అందిస్తోంది. ఎక్కువ మంది యూజర్లు మెరుగైన ఫీచర్ల కోసం చెల్లించేందుకు వెనుకాడడం లేదు.
డెస్క్టైమ్ అధ్యయనం ప్రకారం..
ఏఐ జోరులో భారత్ అగ్రగామిగా కొనసాగుతుందనడంలో సందేహం లేదు. ఈ ధోరణి కారణంగా దేశం నుంచి మరిన్ని ఏఐ స్టార్టప్లు ఉద్భవించడానికి దారితీసే అవకాశం ఉంది. డెస్క్టైమ్ అధ్యయనం ప్రకారం 92.2% భారతీయ కార్యాలయాలు తమ రోజువారీ కార్యకలాపాలలో చాట్జీపీటీ వినియోగాన్ని అనుమతించాయి. చాట్జీపీటీని స్వీకరించడంలో అమెరికా కంటే భారత్ చాలా ముందుంది. యూఎస్ కార్యాలయాలలో 72.2% మాత్రమే చాట్జీపీటీని ఉపయోగిస్తున్నాయి.