భారత్లో తొలి లిక్విడ్ ట్రీ!
సీఓ2 పీల్చుకుని ఆక్సిజన్ విడుదల
నీటి నుంచి లెడ్ తొలగింపునకు మరో టెక్!
ధన్బాద్/గౌహతి: ఢిల్లీసహా మె ట్రో నగరాల్లో అంతకంతకూ పెరుగుతున్న వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకు రెండు కొత్త మార్గాలు ఆవిష్కృతమయ్యాయి. నాచుతో గాల్లోని కాలుష్యాన్ని పీల్చేసేందుకు సీఎస్ఐఆర్–సీఐఎంఎఫ్ఆర్ దేశంలోనే మొదటి లిక్విడ్ ట్రీని తయారు చేయగా... నాచులాంటి బ్యాక్టీరియాతో నీటిలోని సీసం (లెడ్)ను తొలగించేందుకు గౌహతి ఐఐటీ సరికొత్త మార్గాన్ని గుర్తించింది. మొక్కలు సూర్యరశ్మి సాయంతో గాల్లోని కార్బన్డైయాక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్ను వదులుతాయని మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం.
నాచు కూడా మొక్కల్లానే కిరణజన్య సంయోగ క్రియ జరుపుతాయి. ఈ అంశం ఆధారంగా నాచును కాలుష్యాన్ని తగ్గించేందుకు, బయోడీజిల్ లాంటివి తయారు చేసేందుకు చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. తాజాగా సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు స్మార్ట్ ఆల్గల్ లిక్విడ్ ట్రీ (సాల్ట్) పేరుతో ఒక మొబైల్ పరికరాన్ని తయారు చేశారు. ఇది కార్బన్డైయాక్సైడ్తోపాటు గాల్లోని దుమ్ము, ధూళి కణాలను కూడా తొలగించి శుభ్రం చేస్తుందని లిక్విడ్ ట్రీని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త వెట్రివేల్ అంగుసెల్వి తెలిపారు.
సౌరశక్తి, విద్యుత్తుతో నడిచే ఈ లిక్విడ్ ట్రీ నీడలో నలుగురు కూర్చునే ఏర్పాట్లూ ఉన్నాయి. మరోవైపు గౌహతి ఐఐటీ శాస్త్రవేత్తలు బ్లూగ్రీన్ ఆల్గే (సైనోబ్యాక్టీరియా)లోని ఎక్సోపాలిశాకరైడ్ చక్కెరలు నీటిలోని సీసాన్ని 66.2 శాతం వరకూ శోషించుకుంటున్నట్లు గుర్తించారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించుకుంటే దాదాపుగా అన్నిచోట్ల దొరికే బ్లూగ్రీన్ ఆల్గేతో నీటిని శుద్ధి చేసుకునే అవకాశాలు ఏర్పడతాయి.


