- గర్భాన్ని కొనసాగించాలనడం వేధించడమే
- ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: గర్భాన్ని కొనసాగించాలని మహిళను బలవంతం చేయడం, ఆమె శారీరక సమగ్రతకు భంగం కలిగించడమే కాదు, మానసికంగా వేధించడం కిందికి వస్తుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. 14 వారాల గర్భాన్ని అబార్షన్ చేయించుకుందంటూ ఓ మహిళపై భర్త పెట్టిన కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. వైవాహిక సంబంధంలో ఒడిదుడుకులు ఎదురైన సందర్భాల్లో అబార్షన్ కోరుకునే హక్కు మహిళకు ఉందని స్పష్టం చేసింది.
ఐపీసీ సెక్షన్ 312 ప్రకారం ఆమె నేరం చేసినట్లు కాదని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ జనవరి 6వ తేదీన వెలువరించిన తీర్పులో పేర్కొన్నారు. ‘మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(ఎంటీపీ) చట్టం ప్రకారం ఒక మహిళ తన గర్భాన్ని తొలగించుకోవడానికి భర్త అనుమతి/ సమ్మతి పొందాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో మహిళకు పూర్తి స్వతంత్రం ఉంటుంది’ అని తెలిపారు.
వైధవ్యం, విడాకులు వంటి వాటితో వైవాహిక స్థితి మారినా గర్భ విచ్ఛిత్తి చేయించుకోవచ్చని ఎంటీపీలోని 3–బీ(సీ) చెబుతోందన్నారు. వివాహబంధంలో ఉన్నంత మాత్రాన మహిళ తన శరీరంపై ఉన్న హక్కును కోల్పోదని పేర్కొన్నారు. ఇదే ఈ చట్టం అసలు ఉద్దేశమన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి తీవ్రహాని కలిగే అవకాశం ఉన్న సందర్భాల్లో గర్భస్రావం చేయించుకునే హక్కు ఉంటుందన్నారు.
ఇష్టం లేని గర్భం మహిళను మానసికంగా కుంగదీస్తుందని, అది ఆమె జీవించే హక్కును ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. అబార్షన్ సమయంలో తామిద్దరం కలిసే ఉన్నామని, ఎలాంటి మనస్పర్థలు లేనందున ఎంటీపీ చట్టం వర్తించదంటూ భర్త చేసిన వాదనను న్యాయమూర్తి కొట్టి వేశారు. ఆస్పత్రి ఔట్æపేషెంట్ రికార్డులో మహిళ పేర్కొన్న సమాచారాన్ని అత్యంత కీలకమైన సాక్ష్యంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించారు.
ఒక మహిళ తన గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకోవాలని తీసుకున్న నిర్ణయం వెనుక ఎంతో మానసిక సంఘర్షణ ఉంటుందో చెప్పేందుకు ఈ రికార్డే ఉదాహరణ అని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ తెలిపారు. ‘ఆ రికార్డులో ఆ మహిళ తన వివాహ బంధంలో ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని స్పష్టంగా పేర్కొంది. ఆమె అప్పటికే భర్త నుంచి విడిపోవాలని గట్టి నిర్ణయం తీసుకున్నట్లు అందులో ఉంది. ఈ గందరగోళ పరిస్థితుల్లో ఇష్టం లేని గర్భాన్ని కొనసాగించడం ఆమెను మరింత కుంగదీస్తుంది’ అని న్యాయ మూర్తి అభిప్రాయపడ్డారు.
ఒక మహిళ తన భర్తతో విడిపోవాలని అనుకుంటున్నప్పుడు, గర్భం కొనసా గించమని ఆమెను బలవంతం చేయడం మానసికంగా తీవ్రంగా వేధించడమే అవుతుందన్నారు. ‘ఆమె అబార్షన్ చేసుకునే సమయానికే విడిపోవాలని నిర్ణయించుకుంది కాబట్టి, ఆ గర్భం ఆమె భవిష్యత్తుకు, మానసిక ప్రశాంతతకు ఆటంకంగా మారుతుంది. అందుకే ఆమె నిర్ణయం చట్టబద్ధమైందే. ఏ విధంగానూ నేరం కాదు’ అని తీర్పులో స్పష్టం చేశారు. ఐపీసీలోని 312 కింద మెజిస్టీరియల్ కోర్టు ఆదేశాలను సెషన్స్ కోర్టు సమర్థిస్తూ ఇచ్చిన తీర్పును బాధితురాలు సవాల్ చేయగా పైవిధంగా జస్టిస్ బన్సల్ తీర్పు వెలువరించారు.


