జమిలికి ఓకే.. కానీ  సమస్యలను ఎత్తిచూపిన మాజీ సీజేఐలు  | Ex Chief Justices Support Simultaneous Polls | Sakshi
Sakshi News home page

జమిలికి ఓకే.. కానీ  సమస్యలను ఎత్తిచూపిన మాజీ సీజేఐలు 

Jul 7 2025 6:01 AM | Updated on Jul 7 2025 6:44 AM

Ex Chief Justices Support Simultaneous Polls

న్యూఢిల్లీ: లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే విధానానికి పలువురు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు మద్దతు ప్రకటించారు. అయితే ఎలక్షన్‌ కమిషన్‌కు అసాధారణ అధికారాలు కట్టబెట్టడం వంటి అంశాల్లో స్పష్టత, పారదర్శకత అవసరమని మాజీ సీజేఐలు జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేఎస్‌ కేహార్, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ అభిప్రాయపడ్డారు. 

జమిలీ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీకి చంద్రచూడ్‌ తాజాగా తన అభిప్రాయాలను నివేదించారు. ఒకే దేశం, ఒకే ఎన్నికల విధానానికి మద్దతిస్తూనే ‘జమిలీ’లో సవరించాల్సిన లోపాలున్నాయని వ్యాఖ్యానించారు. లోక్‌సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమన్న విపక్షాల వాదనను తప్పుబట్టారు. 

అయితే ఈసీపై అజమాయిషికి తావులేకుండా అసాధారణ అధికారాలు కట్టబెడుతూ రాజ్యాంగ సవరణ బిల్లులో చేసిన ప్రతిపాదనలను చంద్రచూడ్, గొగోయ్‌ తప్పుబట్టారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ముందు చంద్రచూడ్‌తోపాటు మరో మాజీ సీజేఐ జేఎస్‌ కేహర్‌ జూలై 11న అభిప్రాయాలను వినిపించనున్నారు. జమిలి కోసం అసెంబ్లీల కాలపరిమితిని తగ్గించడం, పెంచడం వంటి నిర్ణయాలు తీసుకునే అధికారం ఈసీకి కట్టబెట్టాలన్న ప్రతిపాదనతో చంద్రచూడ్‌ విభేదించారు. మాజీ సీజేఐలు యు.యు.లలిత్, గొగోయ్‌ ఇప్పటికే అభిప్రాయాలను కమిటీ ఎదుట వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement