Corona Vaccine: Narendra Modi Assures all Indians will Get Vaccine, Expert Group to Monitor Distribution Through 28,000 Points - Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కరికీ కరోనా టీకా : ప్రధాని మోదీ భరోసా 

Oct 29 2020 11:57 AM | Updated on Oct 29 2020 5:34 PM

Everyone will be vaccinated: PM Modi assures amid coronavirus threat - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ : ప్రపంచమంతా ప్రాణాంతక కరోనా మహమ్మారి రెండవసారి విజృంభణతో ఆందోళన చెందుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ పౌరులకు ఊరటనందించారు. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే  ప్రజలందరికీ అందిస్తామంటూ  కరోనా మహమ్మారి  వ్యాప్తి తర్వాత తన మొదటి ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీ వెల్లడించారు. మొదటి ప్రాధాన్యంగా బలహీనమైన వారికి, ఫ్రంట్‌లైన్ కార్మికులకు టీకా వేయడంపై దృష్టి పెట్టినప్పటికీ, దేశంలో ఏ ఒక్క పౌరుడిని విడిచిపెట్టకుండా కరోనా టీకా అందిస్తామని ప్రధాని మరోసారి స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తయారీ పురోగతిలో ఉందనీ, ట్రయల్స్ కొనసాగుతున్నా యన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో వ్యాక్సిన్ పంపిణీ వ్యవస్థను సిద్ధం చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసామన్నారు. వ్యాక్సిన్ మోతాదు తదితర మార్గదర్శకాలను  ఈ నిపుణుల బృందం నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు.

కరోనా మహమ్మారి టీకా ప్రతి వ్యక్తికి చేరేలా 28వేలకు పైగా కోల్డ్ చైన్ పాయింట్లును సిద్ధం చేయనున్నామన్నారు. దీంతోపాటు రాష్ట్ర, జిల్లా, స్థానిక స్థాయిల్లో ఏర్పాటు చేసిన బృందాలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా టీకా పంపిణీని పర్యవేక్షిస్తాయన్నారు. అలాగే లబ్ధిదారుల నమోదు, టీకాలను వేసేందుకు ఒక డిజిటల్ వేదికను కూడా సిద్ధం చేస్తున్నట్లు ప్రధాని తెలియజేశారు. వైరస్ ఎపుడు ఎలా విస్తరిస్తుందో అర్థం కావడం లేదు. ఒకసారి గుజరాత్, మరోసారి కేరళ, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తిస్తున్నాం.  అంతలోనే పరిస్థితి అదుపులో ఉన్నట్లు అనిపిస్తుంది.. మళ్లీ  కొన్ని నెలల తరువాత అధ్వాన్నంగా మారుతోందని ప్రధాని వివరించారు. అందుకే అక్టోబర్ 20న దేశానికి తాను ఇచ్చిన సందేశంలో చెప్పినట్టుగానే ఫేస్ మాస్క్, చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం వంటి జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమైందని పునరుద్ఘాటించారు.

కాగా దేశంలో ఎన్నికలు, విపత్తు నిర్వహణ పనులు ఎలా జరుగుతాయో, వ్యాక్సిన్ డెలివరీ వ్యవస్థను కూడా అలాగే అభివృద్ధి చేయాలని గత వారం ప్రధాని మోదీ సూచించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కేసులు 80 లక్షలను దాటేసింది. మరణించిన వారి సంఖ్య 1,20,527 కు చేరుకుంది. దేశంలో గత 24 గంటల వ్యవధిలో 517 మంది ప్రాణాలు కోల్పోయారు.   

Advertisement
 
Advertisement
Advertisement