సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతంలో మరోసారి అగ్నిప్రమాదం కలకలం రేగింది. ఇటీవల ఢిల్లీలోని మాలవీయ నగర్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఇంకా మరువక ముందే.. తాజాగా నోయిడాలోని ఓ ఎత్తైన అపార్ట్మెంట్లో మంటలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది.
నోయిడాలోని ఐవీ కౌంటీ (Ivy County) అపార్ట్మెంట్ సముదాయంలోని 12వ అంతస్తులో ఉన్న ఓ ఫ్లాట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చడంతో భవనం పైభాగం నుంచి భారీగా పొగలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగతో పరిసర ప్రాంతాలు కమ్ముకుపోవడంతో నివాసితులు భయాందోళనలకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భవనంలోని ఇతర ఫ్లాట్లలో ఉన్న వారిని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం.
A fire broke out at the IVY County residential complex in Sector 75, Noida, raising serious concerns about the city’s firefighting preparedness. According to residents, fire brigade hoses were unable to project water beyond the sixth floor. pic.twitter.com/YnFPXZvW3N
— Sanjay Kishore (@saintkishore) June 5, 2026
ఇటీవల ఢిల్లీలోని మాలవీయ నగర్లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై విచారణ కొనసాగుతున్న వేళే, తాజాగా నోయిడాలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం భవనాల అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ప్రస్తుతం మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా, ప్రాణనష్టం సంభవించిందా అనే విషయాలపై అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


