వ్యాక్సిన్‌ మిక్సింగ్‌పై మరింత డేటా కావాలి | COVID-19: More data on vaccine mixing is needed | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌ మిక్సింగ్‌పై మరింత డేటా కావాలి

Jun 27 2021 2:45 AM | Updated on Jun 27 2021 2:45 AM

COVID-19: More data on vaccine mixing is needed - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ రెండు డోసుల్లో... ఒకటి ఒక కంపెనీ, మరొకటి మరో కంపెనీ (మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ టీకా విధానం) వేసుకోవడం వల్ల యాంటీబాడీలు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని ఎయిమ్స్‌ చీఫ్‌ రణ్‌దీప్‌ గులేరియా చెప్పారు. అయితే దీనిపై లోతైన అధ్యయనాలు చేయాలని, మరింతగా సమాచారాన్ని సేకరించాల్సి ఉందని చెప్పారు. భవిష్యత్‌లో వివిధ కంపెనీలకు చెందిన ఎన్నో వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని, అందువల్ల ఏయే కంపెనీల కాంబినేషన్లు బాగా పని చేస్తాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే కేంద్రం ఈ దిశగా అధ్యయనం చేస్తోందని... కొద్ది నెలల్లోనే ఫలితాలు వస్తాయని  తెలిపారు.

బ్రిటన్‌లో ప్రయోగాత్మకంగా ఒక టీకా డోసు ఆస్ట్రాజెనికా (కోవిషీల్డ్‌) రెండో డోసు ఫైజర్‌ ఇచ్చిన వారిలో సైడ్‌ అఫెక్ట్‌లు కనిపించాయని లాన్సెట్‌ జనరల్‌ నివేదిక వెల్లడిస్తే, ఈ రెండు కంపెనీల టీకా డోసుల్ని ఇస్తే మరింత సామర్థ్యంగా పని చేశాయని స్వానిష్‌ అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు డెల్టా ప్లస్‌ వేరియెంట్‌కు పనిచేయవని జరుగుతున్న ప్రచారాన్ని గులేరియా కొట్టి పారేశారు. ఇలాంటి భయాలు పెట్టుకునే బదులుగా ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు. సింగిల్‌ డోసు వ్యాక్సిన్‌ డెల్టా వేరియెంట్‌పై 33 శాతం పని చేస్తుందని, అదే రెండు డోసులు తీసుకుంటే 90 శాతం రక్షణ వస్తుందని వెల్లడైన అధ్యయనాలపై గులేరియా ఆందోళన వ్యక్తంచేశారు. భారత్‌ ప్రజలకి వీలైనంత త్వరగా బూస్టర్‌ డోసు ఇచ్చే కార్యక్రమం మొదలుకావాలని ఆకాక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement