Mask In Air Travel: మాస్కు ధరించడం తప్పనిసరికాదు.. కేంద్రం కీలక ఆదేశాలు..
Published
Wed, Nov 16 2022 6:59 PM
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త కేసులు కనిష్ఠ స్థాయికి చేరుకున్న తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విమానాల్లో ప్రయాణించే వారు మాస్కు ధరించడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. అయితే ప్రయాణికులు మాస్కుకు ప్రాధాన్యమిస్తే మంచిదేనని సూచించింది.
విమానయాన సంస్థలు కూడా ఇకపై విమానాల్లో ప్రకటనలు చేసే సమయంలో మాస్కు తప్పనిసరి అని చెప్పొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. మాస్కులు, ఫేస్ కవర్లు ఉపయోగిస్తే మంచిదని మాత్రమే చెప్పాలని పేర్కొంది.
ఈ ఆదేశాలకు ముందు వరకు విమానాల్లో మాస్కు తప్పనిసరి నిబంధన అమల్లో ఉంది. మాస్కు ధరించని కారణంగా ప్రయాణికులను కిందకు దింపిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం దేశంలో గత 24 గంటల్లో కొత్త 501 కరోనా కేసులు వెలుగుచూశాయి. అంతకుముందు దేశవ్యాప్తంగా 474 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2020 ఏఫ్రిల్ 6 తర్వాత ఇవే అత్యల్పం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే విమానాల్లో మాస్కు తప్పనిసరి నిబంధనను కేంద్రం ఎత్తివేసింది. చదవండి:ఢిల్లీ హత్యోదంతం.. ఆ ఒక్క అబద్దమే అతడ్ని పట్టించింది..