లండన్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కి లండన్లో చేదు అనుభవం ఎదురైంది. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ప్రసంగించిన అనంతరం అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఆయనను ఇబ్బందికరంగా ప్రశ్నలు అడిగారు. ఇటీవల ఆయన చేసిన బొద్దింక వ్యాఖ్యలపై ప్రశ్నలు సందించారు. దీంతో న్యాయమూర్తి నిరసనల మధ్యే ప్రసంగం పూర్తి చేశారు.
జూన్ 4న లండన్లోని బిర్క్బెక్ కాలేజీలో సీజేఐ సూర్యకాంత్ కృత్రిమ మేధస్సు , అంతర్జాతీయ చట్టం అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. అయితే అనంతరం జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కొంతమంది వ్యక్తులు జస్టిస్ సూర్యకాంత్ ఇబ్బంది పడే విధంగా ప్రశ్నలు సందించారు. భారత్లో అసమ్మతిని అణచివేస్తున్నారనే ఆరోపణలపై ప్రశ్నలు లేవనెత్తారు.
అంతేకాకుండా ఇటీవల భారత్లో ఎంతో సంచలనమైన కాక్రోచ్ 'బొద్దింక' వ్యాఖ్యపై సైతం న్యాయమూర్తిని ప్రశ్నించే యత్నంచేశారు. దీంతో జస్టిస్ సూర్యకాంత్ ఒకింత అసౌకర్యానికి లోనయ్యారు. నిర్వాహకులు ఆ ప్రశ్నలు అంశం పరిధిలోకి రావని చెబుతూ మధ్యలోనే నిలిపివేశారు. చివరికి నిరసనల మధ్యే ఈ కార్యక్రమం పూర్తి చేశారు.
అయితే దీనిపై లండన్లోని భారత హైకమిషన్ తీవ్రంగా స్పందించింది. ఎక్స్ ఖాతాలో దీనిపై ప్రకటన విడుదల చేసింది." జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నోత్తరాల సమయంలో అరుపులు అమర్యాదకరం. ఇటువంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు. ఇది గౌరవప్రదమైన సంభాషణకు విరుద్ధం ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే గౌరవప్రదమైన రీతిలో వ్యక్తం చేయాలి" అని హై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా జస్టిస్ సూర్యకాంత్ చేసిన బొద్దింక వ్యాఖ్యలు ఇటీవల దేశంలో పెద్ద దుమారాన్నే రేపిన సంగతి తెలిసిందే.


