
సాక్షి, ఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. బాంబు దాడుల కారణంగా భయాందోళన వాతావరణం నెలకొంది. మరోవైపు.. ఇజ్రాయెల్లో ఉన్న వివిధ దేశాల ప్రజలు ఎప్పుడేం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్లో ఉన్న భారతీయులకు తరలించేందుకు కేంద్రం ఆపరేషన్ చేపట్టనున్నట్టు తెలుస్తోంది.
ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ ఇరాన్లో విదేశీయుల తరలింపునకు ఆ దేశ అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ చేపట్టనుంది. ఇరాన్లో సుమారు పదివేల మంది భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ పేరుతో ఖరారు చేయాల్సి ఉన్నట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం గగనతలం మూసివేసినందున.. భూసరిహద్దుల మీదుగా విదేశీయులకు తీసుకెళ్లొచ్చని ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఇరాన్లో తమ పరిస్థితి దినదినగండంగా ఉందని భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తీసుకెళ్లాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి వైద్య విద్యార్థి ఇంతిసాల్ మొహిదీన్ మాట్లాడుతూ..‘శుక్రవారం తెల్లవారుజామున భారీ పేలుడు శబ్దాలతో నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచా. నాతోపాటు చాలామంది బేస్మెంట్కు పరుగులు తీశాం. అప్పటినుంచి మాకు నిద్ర లేని రాత్రులే మిగిలాయి.
Indian Embassy in Iran issues an advisory for all Indian nationals and persons of Indian origin currently residing in #Iran.
The advisory issued in view of the current situation in Iran.
All Indian nationals and Persons of Indian Origin have been asked to follow the Embassy's… pic.twitter.com/aggk1YGaRj— All India Radio News (@airnewsalerts) June 15, 2025
ప్రతి రాత్రి పేలుడు శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. మేం ఉంటున్న ప్రాంతానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే పేలుడు సంభవించినట్లు తెలిసింది. టెహ్రాన్లోని షాహిద్ యూనివర్సిటీలో నేను ఎంబీబీఎస్ చదువుతున్నాను. నాతో పాటు దాదాపు 350 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. దాడుల నేపథ్యంలో భారత ఎంబసీ మాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. కానీ, మేం చాలా భయపడుతున్నాం. స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నాం. పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారకముందే మమ్మల్ని తరలించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని కోరాడు.
మరోవైపు.. ఇరాన్లో తాజా పరిణామాలపై భారత విదేశాంగ శాఖ (MEA) స్పందించింది. ఈ సందర్భంగా..‘ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితిని టెహ్రాన్లో భారత ఎంబసీ నిరంతరం గమనిస్తోంది. అక్కడి భారతీయ విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొంతమంది విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించింది. మిగతా వారి పరిస్థితిని కూడా ఎంబసీ అధికారులు పరిశీలిస్తున్నారు. నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం’ అని చెప్పుకొచ్చింది.