రైతు ఆందోళనలు: కేంద్రం ప్రతిపాదనలు | Center Fresh Proposals To Farmers Agriculture Laws Today | Sakshi
Sakshi News home page

రైతులతో చర్చలు: కేంద్రం ప్రతిపాదనలు

Dec 9 2020 3:20 PM | Updated on Dec 9 2020 4:49 PM

Center Fresh Proposals To Farmers Agriculture Laws Today - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొత్త చట్టాలను రద్దు చేయడం తప్ప వేరే ప్రత్యామ్నాయం వద్దని అన్నదాతలు ప్రభుత్వానికి తేల్చిచెబుతున్నారు. ఈ క్రమంలో రైతులు మంగళవారం చేపట్టిన భారత్‌ బంద్‌ విజయవంతమైంది. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అనూహ్యంగా రంగంలోకి దిగి రైతు సంఘం నాయకులతో చర్చించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం- రైతుల మధ్య నేడు మరో దఫా చర్చలు జరుగనున్న వేళ ప్రభుత్వం రైతు సంఘాలకు ప్రతిపాదనలు పంపింది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు(అగ్రికల్చర్‌ ప్రొడ్యూస్‌ మార్కెట్‌ కమిటీ-ఏపీఎంసీ), మార్కెట్‌ ట్యాక్స్‌ యథాతథంగా ఉంటాయని స్పష్టం చేసింది.(చదవండి: భారత్‌ బంద్‌ విజయవంతం)

‘‘రైతులు భూములను కోల్పోరు. ప్రైవేటు ట్రేడర్స్‌ కచ్చితంగా రిజిస్టర్‌ చేసుకోవాలి. ట్రేడర్స్‌పై పన్ను విధింపు ఉంటుంది. కనీస మద్దతు ధరపై పునఃసమీక్షకు, లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు సిద్ధం. పంట ఉత్పత్తి, మార్కెట్‌ కమిటీ చట్ట సవరణకు కూడా సిద్ధం. వివాదాలు తలెత్తితే కోర్టులను ఆశ్రయించే హక్కు రైతులకు ఉంటుంది’’ వంటి ప్రతిపాదనలు రైతు సంఘాల ముందు ఉంచింది. ఇక ఈ విషయంపై స్పందించిన భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధికార ప్రతినిధి రాకేశ్‌ టికేత్‌.. ‘‘కేంద్రం పంపిన ప్రతిపాదనల గురించి మేం చర్చించుకుంటాం. రైతులు వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. ఇది వారి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. కేంద్రం చట్టాలు రద్దు చేయకుంటే ఇక్కడే ఉంటాం. ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తే.. రైతులు కూడా అలాగే ఉంటారు. ఏదేమైనా చట్టాలు రద్దు చేయాల్సిందే’’అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement