రైతులతోనే యుద్ధమా? వైరలవుతున్న ఫోటోలు
గోడలు కాదు...బ్రిడ్జిలు నిర్మించండి : రాహుల్గాంధీ
రైతులను నిలువరించేందుకు పోలీసు చర్యలు
రోడ్లపై భారీ ఎత్తున మేకులు, గోడలు, బారికేడ్లు
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త వ్యసాయ చట్టాలకువ్యతిరేకంగా సుదీర్ఘంగా కొనసాగుతున్న రైతు నిరసనోద్యమంలో పోలీసుల భద్రతా చర్యలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. దేశవ్యాప్త రహదారుల దిగ్భందానికి సిద్దమైన రైతు ఉద్యమకారులను నిలువరించేందుకు ఢిల్లీ సరిహద్దులో మేకులు, పెద్ద ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు రహదారి మధ్యలో కాంక్రీట్ పోతపోసి అందులో పదునైన ఇనుప మేకులను అమర్చారు. అలాగే పోలీసు చేతివేళ్లకు రక్షణగా ఉండేందుకు ఓ స్టీల్ తొడుగును, మరో చేతికి డాలును పోలిన తొడుగును ధరించడం గమనార్హం. పోలీసుల సమక్షంలోనే సింగూ సరిహద్దులోని ప్రధాన రహదారి వద్ద రెండు వరుసల ఇనుప రాడ్లను పాతడంతోపాటు, తాత్కాలిక గోడను నిర్మిస్తున్న వైనం విమర్శలకు తావిచ్చింది. రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు తాజాగా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ కూడా మంగళవారం ట్విటర్ ద్వారా స్పందించారు.‘‘గోడలను కాదు...బ్రిడ్జీలను నిర్మించండి’’ అంటూ బీజేపీ సర్కార్పై ఘాటుగా స్పందించారు. ఈ సందర్బంగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు. అటు కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ వాద్రా కూడా మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పోలీసుల తాజా భద్రతా చర్యలపై ఒక వీడియోను పోస్ట్ చేశారు.
కాగా గణతంత్ర దినోత్సం రోజున రైతుల ఆందోళనలో చోటుచేసుకున్న హింస కుట్రలో భాగమని రైతులు ఆరోపించారు. తమ ఉద్యమాన్ని బలహీనపర్చే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయని ప్రకటించారు. అయినా తాము ఉగ్రవాదులమో, ఖలిస్తానీలమో కాదు..తమ హక్కుల సాధన కోసం మాత్రమే పోరాడుతున్నామని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 6న మధ్యాహ్నాం 12 గంటల నుంచి 3 గంటల వరకు దేశవ్యాప్తంగా రోడ్లను దిగ్భంధించనున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
GOI,
Build bridges, not walls! pic.twitter.com/C7gXKsUJAi
— Rahul Gandhi (@RahulGandhi) February 2, 2021
प्रधानमंत्री जी, अपने किसानों से ही युद्ध? pic.twitter.com/gn2P90danm
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 2, 2021