నిన్న జరిగిన బెంగాల్ తొలివిడత ఎన్నికల్లో బీజేపీ భారీగా సీట్లు దక్కించుకోబోతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. పోలింగ్ జరిగిన 152 స్థానాల్లో బీజేపీ ఏకంగా 110 సీట్లను సొంతం చేసుకోబోతుందన్నారు. బెంగాల్ ప్రజలు ప్రస్తుత పాలన పట్ల విసిగిపోయారని, రాష్ట్రంలో ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ఓటర్లు ఎనలేని ఉత్సాహంతో, ఆవేశంతో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారని అందుకే రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యిందన్నారు. ఇది అధికార పక్షానికి వ్యతిరేకంగా జరిగిన నిశ్శబ్ద విప్లవమని అభిప్రాయపడ్డారు. అయితే నిన్న (గురువారం) ప్రధాని మోదీ సైతం ఈ విధంగానే మాట్లాడారు. బెంగాల్లో జరిగిన భారీ ఓటింగ్ ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. మే 4 తర్వాత బెంగాల్లో విజయోత్సవ సభ నిర్వహిస్తామని బెంగాల్ ప్రజలకు ఝాల్మురీ, స్వీట్లు పంపిణీ చేస్తానని తెలిపారు.
కాగా ఎన్నికల ఫలితాలు రాకముందే ఇంత భారీ స్థాయిలో సీట్లు గెలుచుకుంటామని ప్రకటించడం వెనుక బీజేపీ పక్కా వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్రంలోని మిగిలిన విడతల ఎన్నికల ప్రచారం మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. కాగా బెంగాల్ తొలివిడత పోలింగ్లో రికార్డు స్థాయిలో ఏకంగా 92.72శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. కాగా రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది.


