న్యూఢిల్లీ: మొబైల్ యాప్ల ద్వారా ఈ రిక్షాలను నిలిపివేసిన తరహాలోనే, ఇప్పుడు ఏటీఎం మిషన్లను కూడా ఫోన్ యాప్ సహాయంతో బంద్ చేయవచ్చంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొందరు వ్యక్తులు ‘బీఏటీ- బీఎంఎస్’ లాంటి ఇంటర్ఫేస్ కలిగిన యాప్ ద్వారా ఏటీఎంను ఆన్, ఆఫ్ చేస్తున్నట్లు చూపించారు. అయితే సాంకేతిక నిపుణులు ఈ వాదనను పూర్తిగా కొట్టిపారేశారు.
ఇటీవల ఈ రిక్షాలలో ఉపయోగించిన చైనీస్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ (బీఎంఎస్) భద్రతా లోపాల కారణంగా వాటిని యాప్ ద్వారా నియంత్రించడం సాధ్యమైంది. దీనిపై స్పందించిన భారత ప్రభుత్వం ఆ యాప్లను బ్లాక్ చేసింది. కానీ ఏటీఎంల భద్రతా వ్యవస్థ అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. ఇవి బ్యాంకుల సొంత నెట్వర్క్, వీపీఎన్, బహుళ అంచెల సెక్యూరిటీ ఫైర్వాల్స్పై పనిచేస్తాయి. కాబట్టి బ్లూటూత్ లేదా థర్డ్ పార్టీ యాప్ల ద్వారా ఏటీఎంలను హ్యాక్ చేయడం లేదా నియంత్రించడం అసాధ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరల్ వీడియోలోని ఏటీఎం అనుకోకుండా రీబూట్ అవుతున్న సమయంలో, వ్యూస్ కోసం టైమింగ్ మ్యాచ్ చేసి ఈ తప్పుడు ప్రచారానికి తెరలేపి ఉంటారని భావిస్తున్నారు.


