
ప్రతీ 5 కుటుంబాల్లో ఒకటి ఒబెసిటీ బాధిత కుటుంబమే
దేశంలో 10% కుటుంబాల్లోని సభ్యులందర్నీ పీడిస్తున్న అధిక బరువు సమస్య
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో ఒబెసిటీ ఎక్కువ
ఒబెసిటీ హాట్స్పాట్లుగా ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో స్థూలకాలయం పెను సమస్యగా మారుతోంది. దేశవ్యాప్తంగా ప్రజలను అధిక బరువు, ఊబకాయం పట్టిపీడిస్తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్(ఎన్సీఐసీపీఆర్) సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ప్రతి ఐదు కుటుంబాల్లో ఒక కుటుంబంలోని వయోజనులంతా అధిక బరువుతో బాధపడుతున్నట్లు అధ్యయనంలో తేలింది. దాదాపు 20 శాతం కుటుంబాలకు అధిక బరువు సమస్యగా పరిణమించింది.
10 శాతం మంది స్థూలకాయంతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారని అధ్యయనం నివేదించింది. మణిపూర్, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వంటి రాష్ట్రాల్లోని 30శాతం కంటే ఎక్కువ కుటుంబాల్లో దాదాపు పెద్దలందరూ అధిక బరువుతో ఉన్నారు. తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రతి ఐదింట రెండు కుటుంబాల్లో పెద్దలు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇటీవల తమిళనాడు హెల్త్ జర్నల్లో సంబంధిత అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలు, పట్టణ ప్రాంతాల్లో అధిక బరువు, ఊబకాయం సమస్యల వివరాలను అధ్యయనం వెల్లడించింది.
సంపన్న ప్రాంతాలలో ముఖ్యంగా షెడ్యూల్డ్ తెగ వర్గాలలో 12.2 శాతం వరకు ఊబకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. పట్టణ కుటుంబాల్లో దాదాపు 15 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 8 శాతంగా నమోదైంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక సహా దక్షిణ రాష్ట్రాలు స్థూలకాయానికి సంబంధించి హాట్స్పాట్లుగా అవతరించాయి. పట్టణ ప్రాంతాల్లో 30 శాతం కంటే ఎక్కువ పెద్దలు అధిక బరువు కలిగి ఉన్నారని అధ్యయనంలో గుర్తించారు.
తమిళనాడులో 24.4 శాతం, పంజాబ్లో 23.5 శాతం కుటుంబాల్లోని పెద్దలు అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. దేశంలో అత్యధికంగా పుదుచ్చేరిలోని 25.2 శాతం కుటుంబాల్లో పెద్దలందరిలో ఊబకాయం పెద్ద విపత్తుగా తయారైంది. ధనిక వర్గాలు, నగర ప్రాంతాలు, ఆధునిక జీవన విధానం ఉన్న రాష్ట్రాలు ఎక్కువ ఒబెసిటీ, అధిక బరువు సమస్యకు ప్రభావితమవుతున్నాయి.
ఈ ధోరణి మారుతున్న జీవనశైలికి కారణమని అధ్యయనం పేర్కొంది. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం ఎక్కువగా ఉండడం, ఆహార శైలి మార్పు, శారీరక శ్రమ లేకపోవడం, ఆధునిక జీవనశైలి వంటి అంశాలు అధిక బరువు, ఊబకాయానికి ప్రధాన హేతువులవుతున్నాయి. ప్రతీ నాలుగు ధనవంతుల కుటుంబాల్లో ఒక కుటుంబంలోని వారందరినీ అధిక బరువు సమస్య వేధిస్తోంది. దేశంలోని 17.3 శాతం సంపన్న కుటుంబాల్లో ఊబకాయం ఇబ్బంది పెడుతోంది. షెడ్యూల్డ్ జాతుల (ఎస్టీ) వారిలో ఊబకాయం అత్యల్పంగా 4.2 శాతం మాత్రమే నమోదైంది.