
అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదం తర్వాత ప్రయాణికులు హడలెత్తిపోతుండగా.. వరుసగా అదే సంస్థకు చెందిన విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో వామ్మో ఎయిరిండియా అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టోక్యో-ఢిల్లీ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తగా.. కోల్కతా ఎయిర్పోర్టులో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
టోక్యో హనేడా ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్య కారణంగా కోల్కతాకు మళ్లించారు. ఢిల్లీకి వస్తున్న AI 357 బోయింగ్ విమానంలో ప్రయాణికులు, సిబ్బంది.. క్యాబిన్లో ఉష్ణోగ్రత పెరగడాన్ని గుర్తించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమానాన్ని కోల్కతాలో ల్యాండ్ చేశారు.
విమానం కోల్కతాలో సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎయిర్ ఇండియా ప్రకటించింది. విమానంలో సాంకేతిక తనిఖీలు జరుగుతున్నాయని పేర్కొంది. కోల్కతాలోని గ్రౌండ్ సిబ్బంది.. ప్రయాణీకులకు సహాయం చేస్తున్నారని.. వీలైనంత త్వరగా వారిని ఢిల్లీకి తీసుకెళ్లడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది.