జార్ఖండ్లో విషాదం జరిగింది. అత్యవసర చికిత్స నిమిత్తం రాంచీ నుంచి ఢిల్లీ వెళుతున్న ఎయిర్ అంబులెన్స్ దురదృష్టవశాత్తు కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో కెప్టెన్ తో సహా అందులో ప్రయాణిస్తున్న 7గురు అక్కడిక్కకడే మృతిచెందారు. ఈ ప్రమాద వివరాలను అక్కడి అధికారులు అధికారికంగా ధృవీకరించారు.
ప్రమాదంలో మృతిచెందిన వారు కెప్టెన్ వివేక్ వికాస్ భగత్, కెప్టెన్ సవ్రాజ్ దీప్ సింగ్, సంజయ్ కుమార్, డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, సచిన్ కుమార్ మిశ్రా, అర్చనాదేవీ, దురుకుమార్గా గుర్తించారు. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతోనే విమానం క్రాష్ అయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ఆ సమయంలో ఆ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో పాటు పెద్ద ఎత్తున గాలులు వీచినట్లు అక్కడి స్థానికులు తెలిపారు.
రోగి తరుపు బంధువు మాట్లాడుతూ "ఈ నెల 16న రాంచీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సంజయ్కుమార్ని చేర్చాము. అతను అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. అయితే పేషెంట్ పరిస్థితి విషయమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఢిల్లీ తరలించాలని డాక్టర్లు తెలిపారు. లేకపోతే ప్రాణాలకే ప్రమాదమన్నారు. దీంతో ఎయిర్అంబులెన్స్లో ఢిల్లీ వెళ్లేలా ఏర్పాటు చేశాం" అని అన్నారు.
ఇదీ చదవండి: అతని కోసం రూ.8 లక్షలు అప్పు: అంతా క్షణాల్లో మాయం!
కాగా ఉదయం లేచి చూసే సరికి ఎయిర్ అంబులెన్స్ క్రాష్ అయిన వార్త విన్నామని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వాతావరణ కారణాలతో ఫ్లైట్ క్రాష్ అయి ఉండవచ్చని ప్రమాదంపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.


