ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంలో చుక్కెదురు

AB Venkateswara Rao Case SC Issues Stay On AP High Court Order - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన సస్పెన్షన్‌ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌పై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. చంద్రబాబు నాయుడు హయాంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు దేశభద్రతకు ముప్పు వాటిల్లేలా నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్‌ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆయన హైకోర్టును ఆశ్రయించగా సస్పెన్షన్‌పై హైకోర్టు గతంలో స్టే ఇచ్చింది. (చదవండి: ఏపీ హైకోర్టు గ్యాగ్‌ ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే)

అయితే డ్రోన్ల కొనుగోలు కుంభకోణంలో సస్పెన్షన్‌కు గురైన ఏబీని సస్పెండ్‌ చేయడానికి కచ్చితమైన ప్రాథమిక ఆధారాలున్నాయని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో(క్యాట్‌) ఇదివరకే స్పష్టం చేయడం సహా.. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్‌ ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్‌ కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పును ఇవ్వగా.. దానిని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. నేడు విచారణ సందర్భంగా... ఏబీవీ ఉన్నత స్థానంలో ఉన్న కారణంగా నిఘా పరికరాల కేసు దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని, ఆయన సస్పెన్షన్‌పై హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాల్సిందిగా న్యాయస్థానానికి విన్నవించింది. ఈ క్రమంలో గురువారం అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఇక తన  కుమారుడి కంపెనీ పేరుతో ఏబీవీ ఇజ్రాయిల్ నుంచి నేరుగా నిఘా పరికరాలు కొనుగోలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. దేశ భద్రతకు ముప్పు కలిగించే విధంగా ఉన్న ఆయన చర్యల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును కేంద్ర ప్రభుత్వం, క్యాట్ కూడా సమర్థించాయి. కానీ ఏపీ హైకోర్టు మాత్రం సస్పెన్షన్‌ను నిలిపివేస్తూ స్టే విధించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top